నెత్తురోడిన రోడ్లు
ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST
తెల తెలవారుతుండగానే వారి బతుకులు తెల్లారిపోయాయి. గమ్యస్థానాలకు బయలుదేరుతుండగా వారిపైకి మృత్యువు దూసుకొచ్చింది. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వరంగల్ జిల్లా మామునూరు బొల్లికుంట ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఆటోను గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే హనుమకొండ హంటర్రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక కారు అదుపుతప్పి బ్రిడ్జి కింది పడిపోయింది. ఈ ఘటనలో దంపతులు మృతిచెందగా డ్రైవర్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ప్రమాదం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
రెండు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఐదుగురి మృతి
బొల్లికుంట వద్ద ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి
ఖమ్మం ఫ్ర్లైఓవర్ బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ
దంపతుల దుర్మరణం
డ్రైవర్కు తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం
కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరు
రోదనలతో మారుమోగిన ఎంజీఎం మార్చురీ
తెల తెలవారుతుండగానే వారి బతుకులు తెల్లారిపోయాయి. గమ్యస్థానాలకు బయలుదేరుతుండగా వారిపైకి మృత్యువు దూసుకొచ్చింది. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వరంగల్ జిల్లా మామునూరు బొల్లికుంట ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఆటోను గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే హనుమకొండ హంటర్రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక కారు అదుపుతప్పి బ్రిడ్జి కింది పడిపోయింది. ఈ ఘటనలో దంపతులు మృతిచెందగా డ్రైవర్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ప్రమాదం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఆటోను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
ముగ్గురు మృతి.. రెండు ముక్కలైన ఆటో
మామునూరు, మే 22: వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం బొల్లికుంట శివారు వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ధన్నపేట నుంచి వస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖిలావరంగల్ మండలం అల్లిపురం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఎస్కే యాకుబ్పాషా అలియాస్ బబ్లూ(23), హనుమకొండ జిల్లా ప్రశాంత్నగర్కు చెందిన పల్లెపు ఎల్లమ్మ అలియాస్ పద్మ (35), వల్లెపు మీనా(28) అక్కడికక్కడే మృతిచెందారు. వేగంగా ఢీకొనడంతో ఆటో ఇనుప ముక్కలు రోడ్డు సమీపంలో ఉన్న ఇళ్లలో పడిపోయాయి. దీంతో ఆటో రెండు ముక్కలైంది. సంఘటన స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న మామునూరు పోలీసులు మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు.
భయానక వాతావరణం
నడిరోడ్డుపై ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతదేహాలు పూర్తిగా ఛిద్రమయ్యా యి. రోడ్డుపై కొంత దూరంలో మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. తెల్లవారుజా ము కావడంతో జనం సంచారం అంతగాలేక పోవడంతో వాహనాలు అతివేగంగా వెళ్లినట్లు తెలుస్తోంది. తెలతెలవారంగా అటుగా వెళ్లే వాహనదారులు ఈ దృశ్యం చూసి షాక్కు గు రయ్యారు. వెంటనే తేరుకొని పోలీసులకు సమాచారం అందించారు.
మామునూరు ఏసీ పీ నరేష్ కుమార్, సీఐ రమేష్ నాయక్తోపా టు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రోడ్డు పక్కనే పడి ఉన్న మృతదేహాలను వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఆటోను లారీ ఢీకొట్టినట్టు భావిస్తూ, దానికి కోసం అన్వేషిస్తున్నారు. ఇందుకోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామునే ప్రమాదం జరిగినా మృతుల వివరాలు గుర్తించేందుకు పోలీసులకు రాత్రి వరకు శ్రమించారు.
కానరాని స్పష్టత
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ప్రశాంత్నగర్కు చెందిన పల్లెపు పద్మ (35), వల్లెపు మీనా(28)లు ఏంచేస్తుంటారు..? వీరంతా ఆ సమయంలో ఎటు వెళ్తున్నారు..? ఆటోను ఎక్కడ ఎక్కారు..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన మహిళలు ఎవరనేది తెలియరావడం లేదు. కొందరు కూరగాయల వ్యాపారం చేసేవారని చెబుతుండగా, మరికొందరు కూలీ పనికిపోయి తెల్లవారుజామున వస్తుండగా ఈ ప్రమాద జరిగి ఉంటుందని భావిస్తున్నారు. హనుమకొండకు చెందిన ఈ ఇద్దరు మహిళలు ఇటు వైపున ఎందుకు వచ్చారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పెళ్లి సంబంధాలు చూస్తుండగానే..
ఆటో డ్రైవర్ బబ్లూకు తల్లి గతంలో అనారోగ్యంతో మృ తిచెందగా, తండ్రి సాంబయ్య, సోదరుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బబ్లూకు పెళ్లి సంబంధాలు చూస్తున్న ట్లు బంధువులు తెలిపారు. అల్లి తిమ్మాపూర్కు చెందిన ఆటో డ్రైవర్ బబ్లూ ఖమ్మం వెళ్తున్నానని, 3 రోజుల వరకు రానని వెళ్లినట్లు చెబుతున్నారు. కానీ అంత ఉదయాన్నే ఇటు వైపు మళ్లీ ఎందుకు వచ్చి ఉంటాడనేది తెలవడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.
బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ.. దంపతుల మృతి
నయీంనగర్,
మే 22: ఖమ్మంలో ఉన్నతోద్యోగం.. సెలవుదినం కావడంతో దంపతులిద్దరూ కారులో
సొంతూరుకు బయలుదేరారు. అయితే వారికి మృత్యురూపంలో మరో కారు ఎదురైంది. ఉదయం
8గంటల ప్రాంతంలో హనుమకొండ హంటర్ రోడ్డులో గల ఖమ్మం ఫ్లై ఓవర్
బ్రిడ్జిపైకి రాగానే వారి వాహనాన్ని ఎదురుగా వచ్చే కారు ఢీకొంది. దీంతో
కారు బడ్జిపై నుంచి కిందపడింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా,
చికిత్సపొందుతూ మరొకరు మృతిచెందారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ
ప్రమాదానికి సబంధించిన సుబేదారి ఎస్ఐ పున్నం చందర్ తెలిపిన వివరాల
ప్రకారం...
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాజిపల్లి
గ్రామానికి చెందిన తాడూరి సారయ్య(54) ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ విభాగంలో
టెక్నికల్ ఆఫీసర్గా పని చేస్తున్నాడు. భార్య తాడూరి సుజాత(51)తో కలిసి
ఖమ్మం జిల్లా కేంద్రంలోని గట్టయ్య సెంటర్లో నివాసముంటున్నారు. వీరికి
ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందగా, చిన్న
కుమారుడు వారి సొంత గ్రామంలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో
దంపతులు సారయ్య, సుజాతలు ఆదివారం సెలవుదినం కావడంతో ఖమ్మం నుంచి
సొంతగ్రామమైన హుజూరాబాద్ మండలం రాజిపల్లికి టాటా ఇండికా కారు(ఏపీ20 టీవీ
1994)లో డ్రైవర్ ఖాసీం అలీ(32)తో ఉదయం 6 గంటలకు బయలుదేరారు.
హనుమకొండ
జిల్లా కేంద్రం హంటర్ రోడ్డులోని ఖమ్మం ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదకు ఉదయం 8
గంటల ప్రాంతంలో చేరుకోగానే సుబేదారి అదాలత్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న
ఫియట్ (ఏపీ3 ఏసీ 0345) కారు అతివేగంగా వచ్చి సారయ్య కారును ఢీకొట్టింది.
దీంతో వీరి కారు ఫ్టైఓవర్ గోడను ఢీకొని సుమారు 40ఫీట్ల ఎత్తు నుంచి కిందకు
పడింది. దీంతో కారులో తాడూరి సుజాత అక్కడికక్కడే మరణించింది. తాడూరి
సారయ్య, డ్రైవర్ ఖాసీం అలీని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే
సారయ్య మృతి చెందాడు. కారు డ్రైవర్ ఖాసీం అలీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు
వైద్యులు తెలిపారు. మృతుడు సారయ్య కుమారుడు తాడూరి వినయ్భాస్కర్ ఫిర్యాదు
మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సుబేదారి ఎస్ఐ పున్నం
చందర్ తెలిపారు.
ఎంజీఎంలో మిన్నంటిన రోదనలు
హనుమకొండ అర్బన్,
మే 22: ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ ఆదివారం మృతుల కుటుంబసభ్యుల రోదనలతో
మిన్నంటింది. మామునూరు ఆటో ప్రమాదంలో ముగ్గురు, ఖమ్మం బ్రిడ్జిపై నుంచి
కారు పడిన ఘటనలో ఇద్దరు దంపతులు మృతిచెందగా వారి మృతదేహాలను ఎంజీఎం
మార్చురీకి తీసుకొచ్చారు. అక్కడికి చేరుకున్న బంధువులు కన్నీరుమున్నీరుగా
విలపించారు. వైద్యులు మృతదేహాలకు పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.