కూతురి జన్మదిన వేడుకలకు వచ్చి.. అనంతలోకాలకు..

ABN , First Publish Date - 2022-04-29T11:53:18+05:30 IST

కూతురి జన్మదిన వేడుకలకు వచ్చి.. అనంతలోకాలకు..

కూతురి జన్మదిన వేడుకలకు వచ్చి.. అనంతలోకాలకు..

హైదరాబాద్ సిటీ/గజ్వేల్‌ : కూతురు జన్మదిన వేడుకల కోసం హైదరాబాద్‌ వచ్చిన దంపతులు తిరుగుప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని రాజీవ్‌ రహదారిపై గురువారం వేకువ జామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గజ్వేల్‌కు చెందిన జగ్గయ్యగారి శ్రీధర్‌(45), లత(40) దంపతుల కుమార్తె నగరంలోని నిజాంపేటలో ఓ హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ చదువుతోంది. ఆమె జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్‌ వచ్చిన ఆ దంపతులు సాయంత్రం వేడుకల నిర్వహించి గజ్వేల్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. 


ఈ క్రమంలో గజ్వేల్‌ - ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని రాణే బ్రేక్‌ పరిశ్రమ వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి.. అవతలి వైపున సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మరో కారుపై పడింది. ఈ ప్రమాదంలో శ్రీధర్‌, లత  అక్కడికక్కడే మృతిచెందారు. మరో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను  పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవింగ్‌ సీటులో ఉన్న వ్యక్తి నిద్రమత్తు కారణంగానే ప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

Updated Date - 2022-04-29T11:53:18+05:30 IST