బ్రిడ్జి పైనుంచి పడి యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2021-04-13T05:22:45+05:30 IST
వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
బైక్ను ఢీకొన్న కారు
మరో ఇద్దరికి తీవ్రగాయాలు
నెల్లూరు(క్రైం), ఏప్రిల్ 12: వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు నార్త్ ట్రాఫిక్ పోలీసుల సమాచారం మేరకు... కోవూరు మండలం చిన్న పడుగుపాడుకు చెందిన షేక్ సుబహాని(25), షేక్ మంజూరు, ఎస్డీ బాబు హరనాఽథపురం సెంటర్లోని చికెన్షాపులో పనిచేస్తారు. ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు దుకాణానికి వెళ్లి రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేవారు. ఆదివారం పని ఎక్కువగా ఉండటంతో తెల్లవారుజామున 3గంటలకే వెళ్లి రాత్రి వరకు షాపులో పని చేశారు. ఆలస్యం కావడంతో యజమాని బైక్ తీసుకుని చిన్నపడుగుపాడుకు బయలుదేరారు. ఆత్మకూరు బస్టాండు ఫ్లైవోవర్ బ్రిడ్జిపైకి వచ్చే సరికి కావలి వైపు నుంచి వస్తున్న కారు వారిని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. అయితే సుబహాని ఫ్లైవోవర్ బ్రిడ్జి పైనుంచి కింద ఉన్న రోడ్డుపై పడటంతో మరింత తీవ్రగాయాలయ్యాయి, స్థానికులు 108 అంబులెన్స్లో ప్రభుత్వ వైద్యశాలకు అక్కడి నుంచి నారాయణ ఆసుపత్రికి తరలిస్తుండగా సుబహాని మృతిచెందాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్గారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుబహానికి భార్య, కుమారుడు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన మిగిలిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం చెన్నైకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.