ట్యాంకర్‌ ఢీకొని వ్యక్తి దుర్మరణం

ABN , First Publish Date - 2022-05-24T04:17:49+05:30 IST

కృష్ణపట్నం పోర్టుకు వెళ్తున్న వాటర్‌ ట్యాంకర్‌ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.

ట్యాంకర్‌ ఢీకొని వ్యక్తి దుర్మరణం
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ వేమారెడ్డి

ముత్తుకూరు, మే 23: కృష్ణపట్నం పోర్టుకు వెళ్తున్న వాటర్‌ ట్యాంకర్‌ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. సోమవారం ముత్తుకూరు యాక్సిస్‌ బ్యాంకు సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు.. పోర్టులోని షిప్పింగ్‌ ఏజెన్సీ కంపెనీలో పని చేస్తున్న మురుగన్‌ బాలకృష్ణన్‌ అలియాస్‌ బాలమురుగన్‌ (53) మధ్యాహ్న భోజనం కోసం ముత్తుకూరు కూడలికి మోటారు బైకుపై వెళుతుండగా అదే సమయంలో పోర్టుకు వెళుతున్న వాటర్‌ ట్యాంకర్‌ వెనకు నుంచి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్‌ పైనుంచి రోడ్డుపై పడిన మురుగన్‌ బాలకృష్ణన్‌ శరీరంపై నుంచి ట్యాంకర్‌ టైర్లు వెళ్లడంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న షిప్పింగ్‌ ఏజెన్సీల ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొన్నది. ప్రమాదానికి కారణమైన ట్యాంకరును పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సమాచారం అందుకున్న కృష్ణపట్నం సీఐ వేమారెడ్డి, ఎస్‌ఐ శివకృష్ణారెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని మురుగన్‌ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-24T04:17:49+05:30 IST