అతివేగం మహిళ ప్రాణం తీసింది!

ABN , First Publish Date - 2022-05-21T04:10:54+05:30 IST

అతి వేగానికి ఓ నిండు ప్రాణం బలైంది. దగదర్తి మండలం ఉలవపాళ్ల పెట్రోల్‌ బంకు ఎదురుగా జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

అతివేగం మహిళ ప్రాణం తీసింది!
కారులో ఇరుక్కుపోయిన మహిళ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ

ఉలవపాళ్ల వద్ద రోడ్డు ప్రమాదం

లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు

కారులోనే తల్లి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు

చికిత్స కోసం వెళుతూ తిరిగిరాని లోకాలకు..

దగదర్తి, మే 20: అతి వేగానికి ఓ నిండు ప్రాణం బలైంది. దగదర్తి మండలం ఉలవపాళ్ల పెట్రోల్‌ బంకు ఎదురుగా జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లోని మట్టేవాడకు చెందిన కంచర్ల శేషరాణి, కుమారుడు హర్షవర్ధన్‌ ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శేషారాణి కాలికి శస్త్ర చికిత్స నిమిత్తం కుమారుడితో కలిసి శుక్రవారం ఉదయం కారులో బెంగళూరుకు బయలుదేరారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మండలంలోని ఉలవపాళ్ల పెట్రోల్‌ బంకు వద్ద ముందు వెళుతున్న కంటైనర్‌ లారీని ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో వేగంగా వచ్చి లారీని వెనుకవైపు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కారు లారీ కిందకు దూసుకెళ్లి ఇరుక్కుంది. దీంతో ముందు సీట్లో ఉన్న కంచర్ల శేషారాణి(58) అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవింగ్‌ చేస్తున్న హర్షవర్ధన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ సుమన్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రుడు హర్షవర్ధన్‌ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన కంచర్ల శేషరాణి, క్షతగాత్రుడు హర్షవర్ధన్‌లకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ సుమన్‌ తెలిపారు.



Updated Date - 2022-05-21T04:10:54+05:30 IST