రోడ్డు ప్రమాదంలో విజయవాడ వాసి మృతి
ABN , First Publish Date - 2021-04-11T05:06:09+05:30 IST
పెదకాకాని పోలీస్స్టేషన్ సమీపంలోని హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన వ్యక్తి మృతి చెందాడు.
పెదకాకాని, ఏప్రిల్10: పెదకాకాని పోలీస్స్టేషన్ సమీపంలోని హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ పూర్ణానందపేటకు చెందిన మన్నం ఏసుదాసు(33), మాగిపోగు మహేష్ అనే ఇరువురు ద్విచక్రవాహనంపై విజయవాడ నుంచి గుంటూరు వస్తున్నారు. మార్గమధ్యంలోని ఆటోనగర్ వద్ద హైవే దిగే క్రమంలో వెనుక నుంచి తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేష్కు కుడి వైపుకు, ఏసుదాసు ఎడమవైపు పడిపోగా ఏసుదాసుపై బస్సు ఎక్కింది. దీంతో ఏసుదాసు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.