పిచ్చాటూరు తహసీల్దార్కు రివర్షన్
ABN , First Publish Date - 2022-05-27T07:35:47+05:30 IST
తిరుపతి జిల్లాలోని పిచ్చాటూరు తహసీల్దార్ శ్రీదేవిని డిప్యూటీ తహసీల్దారు (డీటీ)గా పర్మినెంట్ రివర్షన్ ఇచ్చారు. అలాగే అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం వీఆర్వో శ్రీనివాసులును సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగించారు.
సర్వీసు నుంచి పెద్దమండ్యం వీఆర్వో తొలగింపు
పెద్దపంజాణిలో 382 ఎకరాల అటవీ భూమికి పట్టాలిచ్చిన వైనం
రుజువు కావడంతో ఐదేళ్ల తర్వాత చర్యలకు సీసీఎల్ఏ ఉత్తర్వులు
చిత్తూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలోని పిచ్చాటూరు తహసీల్దార్ శ్రీదేవిని డిప్యూటీ తహసీల్దారు (డీటీ)గా పర్మినెంట్ రివర్షన్ ఇచ్చారు. అలాగే అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం వీఆర్వో శ్రీనివాసులును సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగించారు. ఈ మేరకు గురువారం సీసీఎల్ఏ ఆయా జిల్లాల కలెక్టర్లకు వేర్వేరు ఉత్తర్వులను ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2017లో పెద్దపంజాణి తహసీల్దార్గా శ్రీదేవి, అదే మండలంలోని కొళత్తూరు, ముత్తుకూరు గ్రామాలకు వీఆర్వోగా శ్రీనివాసులు పనిచేశారు. అప్పట్లో ముత్తుకూరులోని సుమారు 382ఎకరాల ఫారెస్టు భూమిని ప్రైవేటు వ్యక్తులకు పట్టాలిచ్చారు. ఇక, 2017 జూన్ 27న శ్రీదేవి పెద్దపంజాణి నుంచి బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో వచ్చిన సురేష్ ఈ భూకుంభకోణాన్ని వెలికితీశారు. ఆమె రిలీవైన మరుసటి రోజు, అంటే జూన్ 28వ తేది తెల్లవారుజామున వెబ్ల్యాండ్లో నమోదు చేసినట్లు, దానికి సంబంధించిన రికార్డులు లేనట్లు తహసీల్దార్ సురేష్ గుర్తించారు. వీటిపై 2017 అక్టోబరు 18న ‘నలుగురికి 400 ఎకరాలు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారించి అదే ఏడాది నవంబరు 16వ తేదీన శ్రీదేవిని సస్పెండ్ చేశారు. సుమారు ఆరు నెలల తర్వాత పెండింగ్ ఎంక్వయిరీ పేరుతో పోస్టింగ్ ఇచ్చారు. తదుపరి విచారణ కోసం అప్పటి జేసీ-2 చంద్రమౌళిని ఉన్నతాధికారులు విచారణాధికారిగా నియమించారు.
పెద్దపంజాణి మండలం ముత్తుకూరులోని సర్వే నెంబరు 420-2లో 268.84 ఎకరాలు, 351-12లోని 114.2 ఎకరాలకు అటవీ పోరంబోకు భూమిని సబ్డివిజన్ చేసి నలుగురి పేరిట 2017 జూన్ 28వ తేదీన ఆన్లైన్లో నమోదు చేసినట్లు విచారణలో తేలింది. ఆ ప్రకారం.. సర్వే నెంబరు 420-2బిలో 21.13 ఎకరాలు, 351-12లో 22.92 ఎకరాలను ధరణి పేరుతో.. 420-2ఎలో 23.19 ఎకరాలు, 351-11లోని 22.84 ఎకరాలను కోమల పేరిట.. 420-2సీలో 23.15 ఎకరాలు, 351-13లోని 22.15 ఎకరాలను మధుసూదన్ పేరుతో.. 420-2డిలో 25.32 ఎకరాలు, 351-12లోని 22.13 ఎకరాలను రాజన్ పేరుతో రాసిచ్చారు. ఈ మేరకు ఆ నలుగురికి నాలుగు ఖాతా నెంబర్లతో పట్టాలిచ్చారు. ఇదంతా విచారించిన అప్పటి జేసీ-2 చంద్రమౌళి భూ కుంభకోణాన్ని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంది.