గంగా నదిలో మృతదేహాలు వేయకుండా పెట్రోలింగ్

ABN , First Publish Date - 2021-05-17T15:35:06+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంగా నదిలో కొవిడ్ అనుమానిత రోగుల మృతదేహాలను వదులుతున్న...

గంగా నదిలో మృతదేహాలు వేయకుండా పెట్రోలింగ్

అంత్యక్రియలు చేస్తే రూ.5వేల ఆర్థిక సహాయం

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంగా నదిలో కొవిడ్ అనుమానిత రోగుల మృతదేహాలను వదులుతున్న నేపథ్యంలో నదిలో పోలీసులు పెట్రోలింగ్ పెంచారు. మృతదేహాలు నదిలో వదిలేయకుండా, నది తీర ప్రాంతాల్లో ఇసుకలో పూడ్చకుండా వారి అంత్యక్రియల కోసం రూ.5వేల రూపాయలు ఇవ్వాలని యూపీ సర్కారు నిర్ణయించింది. బలియా జిల్లాలో గంగా నదిలో మృతదేహాలు కుళ్లి పోయి తేలుతూ కనిపించాయి. గంగా నదిలో మృతదేహాలు విసిరేయకుండా పెట్రోలింగ్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. 


మృతదేహాలను ఎవరూ నదిలో విసిరేయరాదని పోలీసులు నదీ తీరప్రాంత గ్రామాల్లో ప్రచారం సాగిస్తున్నారు.మృతదేహాలు నదుల్లో పారవేయకుండా 9 పోలీసు బృందాలతో నదీ తీర ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేశామని బలియా ఎస్పీ విపిన్ తడా చెప్పారు. గంగా, యమునా నదుల సంగమం వద్ద ప్రయాగరాజ్ నగరంలోని రెండు ఘాట్లలో ఇసుక తీరాల్లో ఖననం చేసిన మృతదేహాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. కలప ధరలు పెరగడంతో మృతదేహాలను దహనం చేయకుండా ఇసుకలో ఖననం చేస్తున్నారని స్థానికులు చెప్పారు. దీంతో అంత్యక్రియల కోసం ప్రభుత్వం రూ.5వేలు ఇవ్వాలని నిర్ణయించింది.


Updated Date - 2021-05-17T15:35:06+05:30 IST