అక్కడ రాళ్లు కొట్టందే బువ్వ దక్కదు.. 40 ఏళ్లుగా ఇదే తంతు!

ABN , First Publish Date - 2022-03-17T18:08:50+05:30 IST

అక్కడ 40 సంవత్సరాలుగా రాళ్ళు పగలగొట్టే పనులు...

అక్కడ రాళ్లు కొట్టందే బువ్వ దక్కదు.. 40 ఏళ్లుగా ఇదే తంతు!

అక్కడ 40 సంవత్సరాలుగా రాళ్ళు పగలగొట్టే పనులు జరుగుతున్నాయి. పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగౌలోని గ్రానైట్ గనిలో జనం చెమటలు కక్కుతూ కనిపిస్తుంటారు. వారికి సంపాదనకు మరో మార్గం లేకపోవడంతో గనిలో చెమటలు చిందిస్తుంటారు. ఇది ఎలా ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకుందాం. 40 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక గ్రానైట్ క్వారీ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రాంతంలోని వారి జీవనోపాధికి ఈ గని ఒక్కటే ఆధారం. ఇక్కడ గత 40 ఏళ్లుగా ప్రజలు తవ్వకం పనులు చేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ గనికి యజమాని అంటూ ఎవరూ లేరు. ఇక్కడి ప్రజలు గ్రానైట్‌ను తవ్వి విక్రయిస్తుంటారు. 


ఆఫ్రికా న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ పిల్లలు, మహిళలు, పురుషులు ప్రతిరోజూ 10 మీటర్ల గొయ్యిలోకి దిగి గ్రానైట్‌తో బయటకు వస్తారు. తలపై అధిక బరువు ఉన్నప్పటికీ గనిలోని ఏటవాలును ఎక్కిమరీ బయటకు వస్తారు. ఇటువంటి సమయంలో జారి కింద పడిపోయి గాయాలపాలైనవారు అనేకులు ఉన్నారు. ఇక్కడి గ్రానైట్‌ను నేరుగా భవనాల నిర్మాణానికి వినియోగిస్తుంటారు. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. ఇంతలా కష్టపడి పనిచేసినా ఇక్కడి ప్రజలు తమ కనీస అవసరాలకు సరిపడా సంపాదించ లేకపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తే దాదాపు 130 రూపాయలు వస్తుందని గనిలో పనిచేసే మహిళ తెలిపింది. ఈ డబ్బుతో ఇల్లు నడపటం దగ్గర్నుంచి పిల్లల ఫీజులు కట్టడం వరకూ కష్టమేనని వాపోయింది. గనిలో నుంచి వెలువడే పొగ వారి ఆరోగ్యాన్ని పాడుచేస్తోంది. ఇక్కడి కార్మికులకు హెల్మెట్‌లు, ఇతర అవసరమైన భద్రతా పరికరాలు అందుబాటులో లేవు. రాళ్లు పగలకపోతే ఆకలితో చచ్చిపోతామని వారంటున్నారు. 

Updated Date - 2022-03-17T18:08:50+05:30 IST