నిత్యావసరాల ధరలకు రెక్కలు!
ABN , First Publish Date - 2022-05-18T03:42:59+05:30 IST
ఇటీవల కాలంలో అన్నిరకాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై పెనుభారం పడింది.
అదేకోవలో పెట్రోల్, డీజిల్, గ్యాస్
కొనుగోలు చేయలేక జనం బెంబేలు
సామాన్యులపై పెనుభారం
ఉదయగిరి రూరల్, మే 17: ఇటీవల కాలంలో అన్నిరకాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై పెనుభారం పడింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సాంపదించే ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువ అవుతుండడంతో బతుకుబండిని ఏలా నెట్టుకురావాలో అర్థంకాక ప్రజలు అయోమయంలో పడుతున్నారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ, విద్యుత్తు చార్జీల పెంపుదలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వంట నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. ఫామాయిల్ లీటర్ రూ.175, సన్ఫ్లవర్ రూ.205, కందిపప్పు రూ.110, మినపప్పు రూ.100 ధరలు పలుకుతున్నాయి. దీనికితోడు అన్నిరకాల కూరగాయలు ధరలూ భగ్గుమంటున్నాయి. పొట్టేలు, మేక మాంసం కిలో రూ.800, కోడి మాంసం కిలో ధర రూ.300 పలుకుతుంది. ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు పచ్చడి మెతుకులు కూడా కరువయ్యాయి.
గ్యాస్ ధరల పెంపుతో కష్టాలు
గృహ, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ ధరలు నెలనెలా పెరుగుతుండడంతో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉదయగిరి ప్రాంతంలో డొమోస్టిక్ సిలిండర్ రూ.1037, కమర్షియల్ సిలిండర్ రూ.2,540 ఉంది. మహిళలు గ్యాస్ కంటే కట్టెల పొయ్యే నయమంటున్నారు. ఇక చిరు వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు అంత ధర వెచ్చించి వ్యాపారాలు చేయలేని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలు
ఇటీవల ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచడం మరింత భారంగా ఉందని పేదులు వాపోతున్నారు. గతంలో వచ్చే విద్యుత్ బిల్లు కంటే ప్రస్తుతం రెట్టింపు కావడంతో నోరెళ్లబెడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు చేయాలంటే భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజూ పెరుగుతున్న డీజిల్, పెట్రోల్
డీజిల్, పెట్రోల్ ధరలు రోజూ పెరుగుతుండడంతో ప్రజలు మోయలేని భారమైంది. ప్రతి కుటుంబంలో తమ అవసరాల కోసం ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఉదయగిరిలో పెట్రోల్ లీటర్ రూ.121.44, డీజిల్ రూ.107.04 ఉంది. మరోవైపు నిరుద్యోగ యువత ఆటోలు, కార్లు వంటివి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఇంధన ధరలు పెరుగుతుండడంతో తమకు గిట్టుబాటు కావడంలేదని, ఫైనాన్స్ సైతం కట్టలేకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.