పెరుగుతున్న పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-05-17T04:55:43+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వివిధ గ్రామాల్లో కరోనా పరీక్షలు చేపట్టగా వాటిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. పాజిటివ్ కేసుల కాంటాక్ట్లకు వైద్య పరీక్షలు చేస్తుండగా వీరిలోనే ఎక్కువగా నిర్ధారణ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైన వారిని ఆసుపత్రులకు, మిగిలిన వారిని హోం ఐసోలేషన్లో ఉంచుతూ పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వివిధ గ్రామాల్లో కరోనా పరీక్షలు చేపట్టగా వాటిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. పాజిటివ్ కేసుల కాంటాక్ట్లకు వైద్య పరీక్షలు చేస్తుండగా వీరిలోనే ఎక్కువగా నిర్ధారణ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైన వారిని ఆసుపత్రులకు, మిగిలిన వారిని హోం ఐసోలేషన్లో ఉంచుతూ పర్యవేక్షిస్తున్నారు.
పాతపట్నంలో 78 ..
మెళియాపుట్టి (పాతపట్నం): మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం 78 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని తహసీల్దార్ ఎం. కాళీప్రసాద్ తెలిపారు. అలాగే 50 మంది జ్వరపీడితులను గుర్తించామ న్నారు. హోం ఐసోలేషన్లో ఉన్నవారిని నిత్యం పర్యవేక్షించి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివారం పాతపట్నం సీహెచ్సీలో 40, బైదలాపురంలో 126, గంగువాడలో 34 కరోనా పరీక్షలు చేశారన్నారు.
నరసన్నపేటలో 30...
నరసన్నపేట: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డిప్యూటీ తహసీల్దార్ హేమసుందర్ తెలిపారు. అలాగే 81 మందికి వీటీఎం, 18 మందికి ఆర్డీకే ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉండగా పట్టణంలోని పలు వీధుల్లో ఆదివారం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
జలుమూరులో 26...
జలుమూరు: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆదివారం 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తహసీల్దార్ జామి ఈశ్వరమ్మ తెలిపారు. వీరిని హోం క్వారంటైన్లో ఉంచి ఐసోలేషన్ కిట్లు అందించి పర్యవేక్షిస్తున్నామన్నారు. జలుమూరు, అచ్యుతాపురం, సైరిగాం పీహెచ్సీ పరిధిలో ఆదివారం 88 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు తాడేల శ్రీకాంత్, హనుమంతు సునీత, గురునాథరావు తెలిపారు. మర్రివలస గ్రామంలో ఆదివారం పారిశుధ్య పనులు చేపట్టారు. సర్పంచ్ బగ్గు గోవిందరావు, పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో వీధులను శుభ్రంతో పాటు వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఇదిలా ఉండగా మండలంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న మర్రివలసను కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసి నిబంధనలు అమలుచేస్తున్నట్లు వీఆర్వో కె.రాజు, సచివాలయ సిబ్బంది తెలిపారు.
రేగిడిలో 22...
రేగిడి: మండల పరిధిలో ఆదివారం 22 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తహసీల్దార్ బి. సత్యం, రేగిడి పీహెచ్సీ వైద్యాధికారి పార్ధసారధి తెలిపారు. రేగిడి పీహెచ్సీ పరిధిలోని 10 గ్రామాల్లో ఈ కేసులు బయటపడ్డాయన్నారు. కరోనా కేసుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల్లో ఈ కేసులు నిర్ధారణ అయినట్లు చెప్పారు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న వెంకమ్మపేట గ్రామంలో కొవిడ్ పరీక్షలు కొనసాగిస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు.
హిరమండలంలో 15..
కొత్తూరు (హిరమండలం): హిరమండలంలో రెండు రోజులుగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో 15 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి నట్లు ఆదివారం సమాచారం వచ్చిందని తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలు పాటించాలని, అనవసరంగా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.
నందిగాంలో 12...
నందిగాం: మండల పరిధిలో ఆదివారం 12 కరోనా కేసులు నమోదైనట్లు తహసీల్దార్ ఎన్.రాజారావు తెలిపారు. కరోనా బాధిత కుటుంబాల్లోని ప్రైమరీ, సెకెండరీ కాంటాక్ట్లను గుర్తించి వైద్య పరీక్షలు చేయగా ఈ కేసులు బయటపడ్డాయన్నారు. దీంతో వారిని హోం ఐసోలేషన్లో ఉంచినట్లు చెప్పారు. ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్ పర్యవేక్షణలో గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. కాలువలు శుభ్రం చేసి క్లోరినేషన్ చేపట్టారు. కార్యక్రమాల్లో కార్యదర్శులు ఆనందరావు, సంతోష్కుమార్ పాల్గొన్నారు. 57 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యాధికారి కె.అనితకుమారి తెలిపారు.
ఎల్ఎన్పేటలో 4...
ఎల్.ఎన్.పేట: మండలంలో ఇటీవల నిర్వహించిన కరోనా వైద్య పరీక్షల్లో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి రెడ్డి హేమ లత ఆదివారం తెలిపారు. వీరిని పాత్రునివలస క్వారంటైన్ కేంద్రానికి పంపామన్నారు. వ్యాధి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని మందులు అం దించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.