ఆసిఫాబాద్‌ జిల్లాలో కౌలుకు పెరుగుతున్న డిమాండ్‌

ABN , First Publish Date - 2022-05-12T04:04:08+05:30 IST

జిల్లాలో కౌలు చేసేం దుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ ఖాళీ భూమి కనిపించినా భూయజమాని దగ్గరికెళ్లి కౌలు చేస్తామంటూ అడుగుతున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో కౌలుకు పెరుగుతున్న డిమాండ్‌
భూమి దుక్కిదుతున్న రైతు (ఫైల్‌)

- ప్రతీయేటా పెరుగుతున్న ధరలు

- కొన్ని సందర్భాల్లో మిగిలేది అప్పులే

- అయినా కౌలు చేసేందుకు రైతుల ఆసక్తి

- నీటి సౌలభ్యత, పత్తికి గిట్టుబాటు ధర పెరగడమే కారణం

చింతలమానేపల్లి, మే 11: జిల్లాలో కౌలు చేసేం దుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ ఖాళీ భూమి కనిపించినా భూయజమాని దగ్గరికెళ్లి కౌలు చేస్తామంటూ అడుగుతున్నారు. వ్యవసాయం మీద ప్రేమతో కౌలు రైతులు భూములకు ఎంత ధరైనా చెల్లించి సాగుకు సన్నద్ధమవుతున్నారు. వ్యవసా యాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుబంధు, రైతు బీమా పథకాలతో ప్రభుత్వాలు పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఇవి కేవలం భూ యజమానులకు తప్ప కౌలు రైతులకు మాత్రం అమలు కావడం లేదు.  

జిల్లాలో ఇరవై వేల మంది కౌలు రైతులు

జిల్లాలో 15 మండలాల పరిధిలో సుమారు రెండు లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో సుమారు 20వేలమంది కౌలు రైతులు ఉన్నట్లు అధికారుల అంచనా. మరో నెల రోజుల తరువాత సాగు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున కౌలు రైతులు భూ యజమానులతో కౌలు ధరలు మాట్లాడుకుంటు న్నారు. రైతుబంధు కింద భూయజమానులకు పెట్టుబడి సాయం వస్తున్నా కౌలు ధరలు మాత్రం తగ్గించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపె డుతున్న పథకాలతో కౌలు రైతు లకు ఏవిధమైన లబ్ధి చేకూరడం లేదని వారు ఆవేదన చెందుతు న్నారు. పంటకు పెట్టుబడి పెట్టి వ్యవసాయంచేస్తున్నందున తమను సైతం గుర్తించి రైతుబంధు అమలు చేసేలా చూడాలని కోరుతున్నారు. 

పంటలకు అనువైన భూములు

జిల్లాలో నల్లరేడి, ఎర్రమట్టి భూములు అపారంగా ఉన్నాయి. ముఖ్యంగా వరి, సోయాబీన్‌, పత్తి, ఇతర పప్పు దినుసుల పంటల సాగుకు అనుకూల మైన నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి. గతేడాది వానాకాలంలో సాగు చేసిన పత్తి పంటలో చాలా మంది రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతింది. అయినా జిల్లా రైతులు అధికంగా వరి, పత్తి, సోయాబీన్‌ సాగుకే మొగ్గు చూపుతున్నారు. భూమి రకాన్ని బట్టి కౌలు ధర నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎకరానికి రూ.10నుంచి రూ.14 వేల చొప్పున కౌలు ధర చెల్లిస్తున్నారు.

పెట్టుబడులు సైతం రాక అప్పుల పాలు

జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎకరానికి వేలకు వేలు పెట్టి కౌలు తీసుకున్నా సాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రతియేటా నష్టాలు చవిచూస్తు న్నామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు వ్యవసాయ శాఖ గ్రామ సభలు పెట్టి భూ యజమానులకు అవగాహన కల్పించి కౌలు రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి. అయితే ఎక్కడా ఇటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అదే విధంగా రైతులను ఇతర పంటలు సాగు చేస్తే నష్టాలు తగ్గించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కౌలు ధరలు అదుపులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కౌలు రైతులు కోరుతున్నారు.

భూముల కోసం వెతుకుతున్నారు

 - సంజీవ్‌, రైతు, చింతలమానేపల్లి

ఊళ్లలో కౌలు భూముల కోసం మస్తు మంది తిరుగుతుండ్రు. ఎక్కడ ఖాళీ భూమి కనబడినా రైతుల ఇళ్లకు వెళ్లి కౌలు ఇయ్యాలని అడుగుతుండ్రు. ఏ పంట సాగు చేయక పోయినా వరి, పత్తి మాత్రం పండిస్తున్నారు. నష్టాలొచ్చినా పత్తి పంట సాగుజేసుడు మానుతలేరు. భూముల కోసం కౌలు రైతులు నెల రోజుల ముందు నుంచే వెతుకుతున్నారు. 

కౌలు ధర పెరిగింది

- పురుషోత్తం, రైతు, చింతలమానేపల్లి

అయిదారేళ్ల క్రితం కౌలుభూమి ఎకరా నికి ధర రూ.4వేల నుంచి రూ.6వేలు మాత్రమే ఉండేది. ఒకరిని చూసి మరొ కరు ధరలను పెంచుతున్నారు. పత్తి పం టకు ఒక్కసారిగా ధర పెరిగింది. ఇప్పుడు ఎకరానికి రూ.8వేలు ఇస్తామన్నా భూమి లీజుకు ఇయ్యడానికి ముందుకచ్చేటోళ్లు లేరు. దీంతో అధికధరకు కౌలుకు భూములు పడుతున్నాం.

Read more