England vs India: కోలుకున్న రిషభ్పంత్.. బయోబబుల్లో చేరిక
ABN , First Publish Date - 2021-07-22T21:34:14+05:30 IST
కరోనా బారినపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్పంత్ పూర్తిగా కోలుకున్నాడు.
లండన్: కరోనా బారినపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్పంత్ పూర్తిగా కోలుకున్నాడు. పది రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న పంత్ తాజాగా భారత జట్టు బయోబబుల్లోకి ప్రవేశించాడు. పంత్ ఫొటోను షేర్ చేస్తూ బీసీసీఐ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. సౌత్హాల్లో జట్టు బస చేసినప్పుడు పంత్ కరోనాబారినపడ్డాడు. ఆ సమయంలో అతడిలో కొద్దిపాటి లక్షణాలు బయటపడ్డాయి.
పంటినొప్పితో బాధపడుతున్న పంత్ డెంటిస్ట్ను కలిసిన సమయంలో అతడికి డెల్టా వేరియంట్ 3 సోకినట్టు తెలుస్తోంది. అలాగే, యూరో చాంపియన్షిప్ చూసేందుకు వెళ్లినప్పుడు కరోనా సోకి ఉంటుందని కూడా చెబుతున్నారు. విషయం తెలిసిన బీసీసీఐ కార్యదర్శి జై షా జట్టుకు వెంటనే హెచ్చరిక లేఖ పంపారు.
వింబుల్డన్, యూరో మ్యాచ్లు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. కాగా, ప్రస్తుతం భారత జట్టు కౌంటీ ఎలెవన్ జట్టుతో డుర్హమ్లో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఆగస్టు 4 నుంచి నాటింగ్హామ్లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.