కరోనా ఎఫెక్ట్: నగరాలను విడిచిపెట్టిన ధనవంతులు!

ABN , First Publish Date - 2020-03-31T01:02:18+05:30 IST

కరోనా కారణంగా పెరుగుతున్న ధనిక పేద వర్గాలు మధ్య అంతరాలు

కరోనా ఎఫెక్ట్: నగరాలను విడిచిపెట్టిన ధనవంతులు!

ప్యారిస్: ఐరోపా దేశాల్లో కరోనా కారణంగా పేద, ధనిక వర్గాల మధ్య వైషమ్యాలు పొడ చూపుతున్నాయి. ఫ్రాన్స్‌.. మొత్తం లాక్ డౌన్ అవుతోందన్న వదంతి వ్యాపించగానే ధనిక వర్గాలు ప్యారిస్ వంటి మహానగరాలను వీడటం ప్రారంభించాయి. వీరిలో కొందరు ఫ్రాన్స్ ప్రధాన భూభాగానికి సమీపంలో ఉన్న చిన్న ద్వీపం.. నాయిర్‌మోటియర్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.


ఒకే ఒక వంతెన ఆ ద్వీపాన్ని ఫ్రాన్స్ ప్రధాన భూభాగంతో కలుపుతుంది. అయితే వీరి రాకను ముందే ఊహించిన స్థానిక అధికారులు ఆ వంతెనను మూసేశారు. విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియడంతో పోలీసులు వారి చేత బలవంతంగా వంతెనను తెరిపించింది. దీంతో సంపన్న వర్గాలకు చెందిన అనేక మంది ద్వీపానికి పోటెత్తారు. లాక్ డౌన్ సమయంలో ఇరుకిరుకుగా ఉండే నగరాలకంటే ద్వీపాలు, కొండల్లో ఉన్న గ్రామాలే బెటరనేది వారందరి అభిప్రాయం.


దీంతో రాత్రికి రాత్రికి అక్కడ జనాభా రెండింతలైంది. ఇక అక్కడ అడుగు పెట్టగానే అనేక మంది అత్యవసర వస్తువులు పోగేసుకోవడం మొదలెట్టారు. కొందరు బీచ్ వైపు పరుగెత్తారు. కరోనా ఎక్కడ తమ ద్వీపంలోకి అడుగుపెడుతుందో అనే భయంతో ఉన్న స్థానికులకు వీరి తీరు ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలో కొందరు ప్యారిస్ నుంచి వచ్చిన వారి కార్ల టైర్లు పేల్చేశారు.


ఇలా పేద ధనిక వర్గాల మధ్య ఆగాధం పెరుగుతోందని పసిగట్టిన ప్రభుత్వం వెంటనే పోలీసులను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. అయితే ఇదంతా జరిగి రెండు వారాలు కావస్తోంది. ప్రస్తుతం ఆ ద్వీపంలో కరోనా కేసుల సంఖ్య 70కి చేరుకుంది. అయితే ఒక్క ఫ్రాన్సే కాకుండా యూరప్ లోని అనేక దేశాల్లో ఈ తరహా పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కరోనా మహమ్మారి కారణంగా పేద ధనిక వర్గాల మధ్య వైషమ్యాలు మరోసారి హెచ్చరిల్లాయని సామాజిక శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.  

Updated Date - 2020-03-31T01:02:18+05:30 IST