వరి కోతలు మిల్లర్ల కొర్రీలు
ABN , First Publish Date - 2021-10-18T06:09:22+05:30 IST
జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కసరత్తు చేస్తోంది. నెలరోజులుగా వరి కోస్తున్న రైతులు ధాన్యాన్ని ఆరబెట్టకుండానే క్వింటా రూ.1400 చొప్పున అమ్ముకుంటున్నారు.
ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి
దిగుమతి చేసుకోవడానికి స్థలం లేదంటున్న మిల్లర్లు
రబీ ధాన్యంతో నిండి ఉన్న ప్రభుత్వ గోదాంలు, మార్కెట్ షెడ్లు
ఎఫ్సీఐ నుంచి బియ్యం సేకరణ నిలిపివేత
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై సందిగ్ధం
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి) మోత్కూరు,సూర్యాపేట సిటీ : జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కసరత్తు చేస్తోంది. నెలరోజులుగా వరి కోస్తున్న రైతులు ధాన్యాన్ని ఆరబెట్టకుండానే క్వింటా రూ.1400 చొప్పున అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం మద్దుతు ధర ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.1960, సాధారణ రకం ధాన్యానికి రూ.1940 చెల్లిస్తోంది. రైతులు ధాన్యం ఆరబెట్టినా వ్యాపారులు క్వింటాకు రూ.1500కు మించి కొనడంలేదు. దీంతో రైతులు ఆరబెట్టకుండానే అమ్ముకుని నష్టపోతున్నారు. రైతుల డిమాండ్తో ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఈ నెల 16న పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎంఓలకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ యేడాది వానకాలంలో పత్తి, కంది పంటల సాగు తగ్గి వరి సాగు పెరిగింది. రైతులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9,78,360 ఎకరాల్లో వరి సాగు చేయగా, సుమారు 27, 38, 195 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో గత రబీ సీజన్లో 647 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశా రు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు (ఈ సీజన్లో) కూడా అవే కేంద్రా ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తారంటున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేనా...?
ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో తమ ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని రైతులు ఆనందపడుతున్నారు. 2.50 శాతం కమీషన్ వస్తున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే యడానికి పీఏసీఎస్,ఐకేపీ,మార్కెట్ శాఖలు కూడా ఆసక్తి చూపుతున్నా యి. చిక్కంతా కొన్న ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దిగుమతి చేసుకుంటారా లేదా అన్నదే. గత రబీ సీజన్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కింద రైస్మిల్లులకు తరలించింది. గత సీజన్లో రైస్ మిల్లుల్లో దించిన ధాన్యంలో 20శాతం మిల్లింగ్ కాలేదు.మిల్లుల్లోని గోదాములు, ప్ర భుత్వ గోదాములు, మార్కెట్ షెడ్లలో ధాన్యం నిండి ఉంది. గత రబీ సీజన్లో మిల్లుల వద్ద ఆరుబయట వేసిన ధాన్యమే వర్షాలకు తడిసి మొలకెత్తు తోంది. ఇప్పుడు వర్షాకాలం అయినందున ఆరు బయట నిల్వ చేసే పరిస్థి తి ఉండదని,తాముధాన్యం దిగుమతి చేసుకోలేమని మిల్లర్లు అంటున్నారు.
బియ్యం సేకరణను నిలిపి వేసిన ఎఫ్సీఐ
ప్రస్తుతం ఎఫ్సీఐ బియ్యం సేకరణను నిలిపివేయడంతో మిల్లుల నిర్వ హణ కొనసాగడం లేదు. దీంతో స్థలం లేనిది, ప్రభుత్వం పంపినా తాము ధాన్యం దిగుమతి చేసుకోలేమంటున్నారు. ప్రభుత్వం గత సీజన్లో రైస్ మిల్లుల్లో దించిన ధాన్యం నుంచి ఇప్పటివరకు ఎంత బియ్యం ఎఫ్సీఐకి పెట్టారు, మిగిలిన దాంట్లో ఉండాల్సినంత ధాన్యం మిల్లర్ల వద్ద నిల్వ ఉం దా అన్నది తేల్చడానికి ఇటీవల జిల్లాలో మూడు రైస్ మిల్లులను శాంపిల్ గా తీసుకుని ఎఫ్సీఐ, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు సంయుక్తం గా విచారణ చేపట్టారు. మిల్లర్లు పెటిన్ట స్టాక్ బోర్డులను విశ్వసించకుండా, ప్రతీ బస్తా లెక్కించారు. ధాన్యం దిగుమతి, ఎగుమతి, మిగిలిన ధాన్యం నిల్వలో తేడాలు లేకుండా సక్రమంగా నిర్వహించే మిల్లులనే అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. జిల్లాలో 27 పార్బాయిల్డ్ రైస్ మిల్లులు ఉండ గా, అందులో మూడింటిలో మాత్రమే స్టాక్ వెరిఫికేషన్ చేసి మిగతా మిల్లులు చేయకపోవడంలోని ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొందరు మిల్లర్లు గత యేడాది వానాకాలంలో దించుకున్న ధాన్యానికి సరిపోయే బియ్యం కూడా ప్రభుత్వానికి ఇవ్వలేదని తెలుస్తోంది. వారి వద్ద ప్రభుత్వానికి ఇవ్వాలిన బియ్యానికి సరిపడా స్టాక్ కూడా లేదని సమా చారం. కాగా ఎఫ్సీఐ, పౌరసరఫరా అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ చేసి న మిల్లుల యజమానులే ఈనెల 18నుంచి ఎఫ్సీఐకి ఎగుమతి చేయాల ని అధికారులు చెబుతుండగా, పౌరసరఫరాల అధికారులు మాత్రం మిల్లర్లందరూ ఎఫ్సీఐకి బియ్యం పంపాలని కోరినట్లు తెలిసింది. దీంతో అందరి నుంచి బియ్యం తీసుకుంటారా లేక ప్రత్యక్షంగా నిర్ధారించిన మిల్లుల నుంచే బియ్యం తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. సుమారు 15 నుంచి 20 రోజులుగా ఎఫ్సీఐ బియ్యం సేకరణను నిలిపివేయడంతో ధాన్యం నిల్వ చేసే స్థలాలు ఖాళీకాలేదు. ఈ పరిస్థితుల్లో ధాన్యం నిల్వ చేసుకోవడానికి స్థలం లేకపోయినా మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకుంటారా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. పౌరసరఫరాల, డీఆర్డీఏ, మార్కెటింగ్, సహకార, వ్యవసాయ శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో కలిపి సమీక్ష జరిపితేగాని ధాన్యం కొనుగోలు విషయం తేలేలా లేదంటున్నారు.
ఏఈవో, తహసీల్దార్ల పర్యవేక్షణ
రెండువారాల్లోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రంగం ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మొదటి విడతగా భువనగిరి, భూదాన్పోచంపల్లి, వలిగొండ, చౌటుప్పల్, రాజాపేట, చౌటుప్పల్, తదితర మండలాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పట్టాదారు పాసు పుస్తకాల ఆధారం గా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండేందుకు జిల్లాలోని రైతుల వివరాలను ‘ఆన్లైన్’లో పొందుపరిచారు. ఏయే మండలాల్లో ఎంతమంది రైతులు ఉన్నారన్న సమాచారంతో పాటు, రైతు ల భూములకు సంబంధించిన సర్వేనెంబర్లతో సహా సెంటర్ఫర్ గుడ్ గవరెన్స్ (సీజీజీ) సహకారంతో ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రాల్లోనూ రైతులకు సంబంధించి న పూర్తి వివరాలను వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పౌరసరఫరాల శాఖ ట్యాబ్లతో పాటు ప్రింటర్ల ను కూడా పంపిణీ చేయనున్నారు. ధాన్యం సేకరణపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేందుకు సీయూజీ సౌకర్యం కూడా కల్పించనున్నా రు. వరి నాణ్యతను పరిశీలించేందుకు ప్రతీ కేంద్రంలోనూ అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్(ఏఈవో), వీర్వోలు, తహసీల్దార్లు పర్యవేక్షించనున్నా రు. కేంద్రాల వద్ద వైద్య సౌకర్యాన్ని కూడా ఏర్పాటుచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘లువీ’ సేకరణలో మార్పులు తీసుకొచ్చింది. కేంద్రం నిబంధన ల ప్రకారం రైతుల వద్ద 100శాతం ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థనే కొనుగోలు చేయాలి. దీంతో పౌరసరఫరాల శాఖ మద్దతు ధరకు వరి ధాన్యం సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడంతో జాప్యం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు :గోపీకృష్ణ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, యాదాద్రి భువనగిరి
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రణాళికను రూపొందించాం. ఈ నెలాఖరు వరకు అన్ని మండలాల్లోనూ వరిపంట చేతికి వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 160 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించనున్నాం. ఈ సీజన్లో దాదాపు 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.
సూర్యాపేట జిల్లా
వరి సాధారణ సాగు విస్తీర్ణం : 2,56,387 ఎకరాలు
సాగు చేసింది : 4,69,535 ఎకరాలు
దిగుబడి అంచనా : 11,26,848 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు కేంద్రాలకు రానున్న ధాన్యం (అంచనా) :4,12,244
ప్రతిపాదిత ధాన్యం కొనుగోలు కేంద్రాలు : 247 (ఐకేపీ, ఏపీఏసీఎస్)
నల్లగొండ జిల్లా
సాగైన వరి విస్తీర్ణం: 4,53,752 ఎకరాలు
దిగుబడి అంచనా : 11,02,875 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు కేంద్రాలకు రానున్న ధాన్యం (అంచనా) :5,43,000
ప్రతిపాదిత ధాన్యం కొనుగోలు కేంద్రాలు : 280 (ఐకేపీ, ఏపీఏసీఎస్)
యాదాద్రి భువనగిరి జిల్లా
సాగైన వరి విస్తీర్ణం: 2,68,221 ఎకరాలు
దిగుబడి అంచనా : 5,08,472 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు కేంద్రాలకు రానున్న ధాన్యం (అంచనా) :2,25,487
ప్రతిపాదిత ధాన్యం కొనుగోలు కేంద్రాలు : 120 (ఐకేపీ, ఏపీఏసీఎస్)