మోదీ పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
ABN , First Publish Date - 2022-06-30T05:28:28+05:30 IST
ప్రధాని మోదీ వచ్చేనెల 4న భీమవరం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి రేవు ముత్యాలరాజు
సీఎం కో–ఆర్డినేటర్ రఘురాం సభా ప్రాంగణం పరిశీలన
భీమవరం, జూన్ 29 : ప్రధాని మోదీ వచ్చేనెల 4న భీమవరం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. బుధవారం బహిరంగ సభ వేదిక ప్రాంతం, పక్కనే వున్న హెలీప్యాడ్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వర్షం వస్తే ప్రత్యామ్నాయంగ ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఏమిటనేది ఆరా తీశారు. కలెక్టర్ పి. ప్రశాంతి మంగళవారం భీమవరం వచ్చిన కేంద్ర భద్రతా బృందం వచ్చి చూసిన అంశాలను వివరించారు. వాతావరణ పరిస్థితుల దృష్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందస్తుగా ప్రణాళిక ద్వారా చేపట్టాలని సూచించారు.
ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలి : తలశిల రఘురాం
ప్రధాని పర్యటన ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సీఎం ప్రోగ్రామ్ కోఆర్టినేర్ తలశిల రఘురాం ఆదేశించారు. బుధవారం భీమవరం విచ్చేసి కలెక్టర్ పి.ప్రశాంతి, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుతో కలిసి సభా ప్రాంగణాలను పరిశీలిం చారు. పార్కింగ్ ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డీసీసీ బీ చైౖర్మన్ పీవీఎల్ నరసింహరాజు, సబ్ కలెక్టర్ విష్ణుచరణ్, ఆర్డీవో దాసిరాజు తదితరులు ఉన్నారు.
పొరపాట్లకు తావివ్వొద్దు : ముత్యాలరాజు
మోదీ పర్యటన సందర్భంగా ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి పొరపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రధానిమంత్రి పర్యటన నోడల్ అధికారి రేవు ముత్యాలరాజు శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పలు శాఖల జిల్లా అధికారులతో సమావేశమై ఏర్పాట్లను శాఖ ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, నోడల్ అధికారులు వారి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి పీఎంవో నిబంధనలకు అనుగుణంగా సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ట్రాఫిక్ డైవర్షన్, పార్కింగ్ ప్రదేశాలను ముందుగానే ప్రకటించి ప్రచారం చేయాలన్నారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభాస్థలికి వెళ్లే మార్గాలలో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి ప్యాకెట్లు, బయోటాయిలెట్స్ సిద్ధం చేసుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు కళాకారులను ముందుగానే గుర్తించి సిద్ధం చేయాలన్నారు.
సభా స్థలి, హెలీప్యాడ్ల పరిశీలన
ప్రధాని పర్యటన నోడల్ అధికారి రేవు ముత్యాలరాజు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత భార్గవ్లతో కలిసి హెలిప్యాడ్లు, బహిరంగ సభ ప్రదేశం పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఆ రెండు రోజుల్లో వాహనాలకు అనుమతి లేదు..
నోటీసులు జారీ చేసిన పోలీసులు
కాళ్ళ, జూన్ 29 : ప్రధాని మోదీ భీమవరం పర్యటన సందర్భంగా ప్రైవేటు కంపెనీ, పాఠశాల వాహనాలకు వచ్చేనెల మూడు, నాలుగు తేదీల్లో అనుమతి లేదని కాళ్ల ఎస్ఐ వి.రాంబాబు తెలిపారు. ఆయా ప్రైవేటు పాఠశాలల, కంపెనీలకు పోలీసులు ముందస్తు నోటీసులు బుధవారం అందజేశారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి భీమవరం, పెదఅమిరం గ్రామంలోకి ప్రైవేటు వాహనాలు అనుమతించమన్నారు. ట్రాఫిక్ అడ్డంకులు కలిగించిన వాహనదారులపై చర్యలు తీసుకుంటామన్నారు.