విప్లవం కాదు వినాశనమే

ABN , First Publish Date - 2020-09-23T06:31:15+05:30 IST

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతుల రాత మారిపోతుందని, విపక్షాలు ఆరోపిస్తున్నట్లు రైతులకు లభించాల్సిన కనీస మద్దతు ధరకు ఎలాంటి ఇబ్బంది...

విప్లవం కాదు వినాశనమే

కొత్త వ్యవసాయ బిల్లుల ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, మార్కెట్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి బహుళజాతి కంపెనీలకు అప్పచెబుతుందన్నది వాస్తవం. సమాఖ్య విధాన స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా బిల్లులను ఆమోదింపచేసుకోవడం గర్హనీయం. కేంద్రం ఈ బిల్లులతో రైతులకు సిరులు కురిపించడం కాదు, ఉరి బిగించబోతుందన్నదే నిజం.


కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతుల రాత మారిపోతుందని, విపక్షాలు ఆరోపిస్తున్నట్లు రైతులకు లభించాల్సిన కనీస మద్దతు ధరకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, రైతులు దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకుని అధికరెట్లు ఆదాయం పొందేందుకు అవి దోహదం చేస్తాయని, కాంట్రాక్టు వ్యవసాయం చేయవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘వ్యవసాయంలో ఇక విప్లవమే’ శీర్షికన రాసిన కథనంలో పేర్కొన్నారు. కానీ, వాస్తవానికి ఇవన్నీ పూర్తిగా సత్యదూరం. కేంద్రం ఆమోదింపచేసుకున్న బిల్లులకు, చేస్తున్న ప్రచారానికి ఏ మాత్రం పొంతన లేదు. అమిత్ షా చెప్పినట్లు విపక్షాలు మాత్రమే ఈ బిల్లులను వ్యతిరేకించడంలేదు. 22 ఏళ్లుగా వారితో మిత్రపక్షంగా ఉన్న శిరోమణి అకాళీదళ్ ఈ బిల్లులను వ్యతిరేకించడంతో పాటు కేంద్ర కేబినెట్ నుంచి ఎందుకు వైదొలగింది? దీనిని బట్టి విపక్షాల మీద తుపాకీ పెట్టి కేంద్రం రైతులను, వినియోగదారులను కాల్చుతోందన్నది వాస్తవం కాదా? కొత్త వ్యవసాయ బిల్లులతో రైతుల కనీస మద్దతుధరకు ఎలాంటి ఇబ్బందులు లేనట్లయితే ఆ అంశాన్ని బిల్లులలో ఎందుకు పొందుపరచలేదు? పంజాబ్, హర్యానాలలో రైతులు రోడ్ల మీదకు ఎందుకు వస్తున్నారు? వారు ప్రతిపక్ష రైతులా? అధికారపార్టీ రైతులా? 


కేంద్రం ఆమోదింపచేసుకున్న నిత్యావసర వస్తువులను నిలువ చేసుకునే బిల్లు, కంపెనీలు రైతులకు మధ్య ఒప్పందం, పంట దిగుబడులను ఎక్కడైనా అమ్ముకునే బిల్లు; కార్పొరేట్ కంపెనీలు నేరుగా రైతులతో కాంట్రాక్టు వ్యవసాయ ఒప్పందాలు చేసుకునే బిల్లులతో రైతులకు, వినియోగదారులకు ఎన్నో నష్టాలు ఎదురుకానున్నాయి. మొదటి బిల్లులో నిత్యావసర వస్తువులు ఎంత మొత్తంలోనైనా నిలువ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కార్పొరేట్ శక్తులు కృత్రిమ కొరతను సృష్టించి వినియోగదారుల నడ్డివిరిచేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. వందశాతం ధరలు పెరిగే వరకు నిత్యావసర వస్తువుల విషయంలో చర్యలు తీసుకునేందుకు వీలులేకుండా చేసే ఈ బిల్లు ఎవరి ప్రయోజనాల కోసం? ఐదెకరాల లోపు వ్యవసాయ కమతాలు ఉన్న రైతులే దేశంలో 86 శాతం మంది, తెలంగాణలో 92.5 శాతం మంది ఉన్నారు. వాళ్లు ఇప్పటివరకు ఎన్నడైనా తమ పంటలను నిల్వ చేసుకున్నారా? కల్లాల వద్దనే పంటలు అమ్ముకుని అవసరాలు తీర్చుకునే రైతులు ఈ బిల్లు వల్ల తమ పంటల్ని ఎక్కువ కాలం నిలువ చేసుకుని, దేశంలో ఎక్కడైనా అమ్ముకుని లాభపడతారని చెప్పడం పూర్తిగా వాస్తవ దూరం. కేంద్రం ఇప్పటివరకు దేశంలో 23 పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర నిర్ణయిస్తోంది. వాటిలో కూడా అన్ని పంటలను సేకరించడం లేదు. దేశంలో పండిన గోధుమ, వరిలో 6 శాతం మాత్రమే ప్రభుత్వం సేకరిస్తోందని 2015 జనవరి 12న శాంతాకుమార్ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ఇప్పుడు ఈ బిల్లుతో కేంద్రం పూర్తిగా మద్దతు ధరల విధానానికి తిలోదకాలు ఇస్తోంది.


ఇప్పటివరకు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు, కనీస మద్దతుధరల సిఫారసుకు అనుసరిస్తున్న పద్ధతులే లోపభూయిష్టంగా ఉన్నాయి. కనీస మద్దతుధరలు నిర్ణయించడానికి అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించడం కోసం కేంద్ర ప్రభుత్వ నీతిఅయోగ్ సభ్యుడు డాక్టర్ రమేష్ చంద్ ఆధ్వర్యాన ఏర్పటు చేసిన కమిటీ 2015 ఆగస్టు 2న ఇచ్చిన నివేదికలో ఎన్నో లోపాలను ఉటంకిస్తూ 23 సిఫారసులు చేసింది. ఉదాహరణకు వ్యవసాయ కుటుంబ యజమాని శ్రమశక్తి విలువను సాధారణ కూలీతో సమానంగా కాకుండా నిపుణుడైన శ్రామికుడి వేతనంతో సమానంగా లెక్కలోకి తీసుకోవాలని, కౌలుచట్టాలలో పేర్కొన్నట్లు కాకుండా వాస్తవంగా మార్కెట్లో అమలవుతున్న కౌలును పరిగణనలోకి తీసుకోవాలని, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు తెచ్చి రైతు పెట్టే పెట్టుబడిపై బ్యాంకు వడ్డీరేటును కాకుండా రైతు చెల్లించిన అసలైన వడ్డీని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. విదేశీ వాణిజ్య విధానాలు పంటల ధరలపై తీవ్రంగా ప్రభావం చూపడం, స్థిరపెట్టుబడిపై వడ్డీ, ఉత్పత్తి పరికరాల అరుగుదలను; ద్రవ్యోల్బణం, భూమిపై రైతు పెట్టే పెట్టుబడి అనగా కంచె, బోరుబావి, పొలం చదునుచేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని లెక్కించాలని సిఫారసు చేసింది. కానీ ఇప్పటి వరకు మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీటిలో ఏ ఒక్క సిఫారసునూ అమలు చేయలేదు.


కార్పొరేట్ కంపెనీలతో కలిసి రైతుల కాంట్రాక్టు వ్యవసాయం అనేది మరో పెద్ద కుట్ర. సామాన్య రైతుల వెంట నిలిచే మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేస్తూ రైతులను, కంపెనీలను నేరుగా అనుసంధానం చేయడమే కాకుండా, ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కార మార్గాలను మరింత జటిలం చేస్తుంది ఈ బిల్లు. ఇప్పటిదాకా మండల, డివిజన్ స్థాయిలో ఉన్న వివాద పరిష్కార మార్గాలే పూర్తిగా రైతులకు న్యాయం చేయలేకపోతున్నాయి. అలాంటిది జిల్లా అదనపు కలెక్టర్ స్థాయిలో పరిష్కారాలు చేసుకోవాలనడం రైతుల గొంతు నొక్కడమే. ఓ సామాన్య రైతు బడా కార్పొరేట్ సంస్థలతో న్యాయపోరాటం చేయగలడా? మరి ప్రభుత్వం గానీ, దాని అనుబంధ సంస్థలు గానీ రైతుకు అండగా లేకుండా చేయడం కార్పొరేట్ శక్తులకు ఊతమివ్వడం కాదా? పంట దిగుబడులను మార్కెట్లలోనే అమ్ముకోవాల్సిన అవసరం లేదనడమంటే మార్కెట్ వ్యవస్థను రూపుమాపడమే. కార్పొరేట్‌ సంస్థలు కనుసన్నలలో మార్కెట్లు కొనసాగడం జరిగితే గిట్టుబాటు ధర కాదు కదా, కనీస మద్దతుధరల ఒప్పందాలకు కూడా ఈ సంస్థలు అంగీకరించవు. మరి ఇలాంటి పరిస్థితులలో రైతులకు ఎలా న్యాయం జరుగుతుంది? కార్పొరేట్ కంపెనీలు రైతులతో కాంట్రాక్టు కుదుర్చుకుని వ్యవసాయం మొదలుపెట్టాయి అనుకుందాం. ఫలానా ప్రాంతం, మండలంలో ఫలానా పంటను పండిస్తే ఈ ధరను ఇస్తానని రైతులకు కంపెనీ చెబుతుంది. ఆ ప్రాంతంలోని రైతులంతా ఒకేరకం కూరగాయలు, పప్పుదినుసులు, నూనెగింజలు తదితర పంటలు సాగు చేస్తారు. కానీ ఆ ప్రాంత వినియోగదారులు, రైతులు తాము నిత్యం ఉపయోగించే కూరగాయలు, ఇతర నిత్యావసరాలకు అదే బహుళజాతి సంస్థ ఇంకో చోట పండించి తెచ్చే వాటి మీదనే ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు ధర, నియంత్రణ అంతా ఆ సంస్థదే. 


ఇంతకుముందు మార్కెట్ లో నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పితే కేంద్ర ప్రభుత్వం తన వద్ద ఉన్న నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసి, నిత్యావసర వస్తువుల చట్టం ప్రయోగించి ధరల స్థిరీకరణకు తోడ్పడేది. కానీ కొత్త బిల్లు ప్రకారం రైతులు, వినియోగదారులను కార్పొరేట్ల ఇష్టారాజ్యానికి వదిలేసి కేంద్రం తన కనీస బాధ్యతల నుంచి తప్పుకుంటుంది. ప్రభుత్వం తరపున నిత్యావసరాలను నిలువచేసే ఎఫ్‌సీఐ లాంటి సంస్థలు తాజా బిల్లుతో కనుమరుగు కానున్నాయి. తదుపరి, ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే మోదీ ప్రభుత్వం లక్ష్యంగా కన్పిస్తోంది. ఇది దేశంలోని అత్యధిక శాతం సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. లాభాపేక్ష తప్ప ఏ మాత్రం మానవత్వం లేని విదేశీ, స్వదేశీ బహుళజాతి కంపెనీలు, వ్యాపారులు గ్రామీణ పేద రైతాంగ ప్రయోజనాల పరిరక్షణకు, వాళ్లకు అధిక ఆదాయం కల్పించడానికి సహకరిస్తారని చెప్పడం హస్యాస్పదం.


నిత్యావసరచట్టం పరిధి నుంచి ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, నూనెగింజలు, పప్పుధాన్యాలను తొలగించడం వినియోగదారులను నిండా ముంచడమే. గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్కెట్‌ యార్డులకు తెచ్చి అమ్ముకోవడం ద్వారా స్థానికంగా ఉండే హమాలీలు, చాటకూలీలకు ఇప్పటి వరకు ఉపాధి లభిస్తోంది. వ్యాపారులు, దళారులు లబ్ధి పొందుతున్నారు. ఎప్పుడైనా ధరలు పెరిగితే రైతులకి ప్రయోజనం దక్కేది. పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థ పడగనీడకు వెళ్తే రైతుకు లాభం దక్కుతుందా? వినియోగదారుడికి సరసమైన ధరలలో నిత్యావసర వస్తువులు లభిస్తాయా? కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గత ఆరేళ్లలో సాగునీటి వసతులు పెంపొందించి, రైతుబంధు, రైతుభీమా పథకాలు, అమలు చేసి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించి, వందశాతం పంటలు కొనుగోలు చేస్తుండంతో రైతులు ధీమాగా వ్యవసాయం చేస్తున్నారు. కేంద్ర బిల్లులతో మార్కెట్ వ్యవస్థతో పాటు గోదాంలన్నీ కార్పొరేట్ వ్యవస్థ చేతిలోకి వెళ్లనున్నాయి. అసంఘటిత వ్యవసాయరంగాన్ని, రైతాంగాన్ని సంఘటితం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు విధాల ప్రయత్నిస్తున్నది. కొత్త బిల్లులతో ఆ ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తున్నాయి. ఈ బిల్లుల ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, మార్కెట్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి బహుళజాతి కంపెనీలకు అప్పచెబుతుంది అనేది వాస్తవం. సమాఖ్య విధాన స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా బిల్లులను ఆమోదింపచేసుకోవడం గర్హనీయం. కేంద్రం ఈ బిల్లులతో రైతులకు సిరులు కురిపించడం కాదు, ఉరి బిగించబోతుందన్నదే నిజం.


సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రాష్ట్ర వ్యవసాయ మంత్రి

Updated Date - 2020-09-23T06:31:15+05:30 IST