జీవో 117కు వ్యతిరేకంగా ఉద్యమం
ABN , First Publish Date - 2022-06-28T05:46:57+05:30 IST
జీవో 117కు వ్యతిరేకంగా ఉద్యమం
ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 27: విద్యారంగాన్ని నాశనం చేసే జీవో 117 ఉత్త ర్వులకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై పోరాడదామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పిలుపునిచ్చారు. యూటీఎఫ్ ఉద్యమనేత డి.రామిరెడ్డి 6వ వర్థంతిని సోమవారం ఏలూరులోని సంఘ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో సాబ్జీ మాట్లాడారు. వందేళ్ల విద్యావిధానాన్ని భ్రష్టు పట్టించేలా పాఠశాలలను ముక్కలుగా చేయడం విచారకరమన్నారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుండటం బాధాకరమన్నారు. జీవోకు వ్యతిరేకంగా రాబోయేకాలంలో రౌండ్టేబుల్ సమావేశాలు, రాష్ట్రస్థాయి విద్యాసదస్సులు, ఢిల్లీలో అఖిల భారతస్థాయి సదస్సును నిర్వహిస్తామని పేర్కొ న్నారు. సంఘ నాయకులు శ్యాంబాబు, సుభాషిణి, ముస్తఫా అలీ, రాజు, అనురాధ, పి.వి.నరసింహారావు పాల్గొన్నారు.