రైతుల పక్షాన ఉద్యమిస్తాం
ABN , First Publish Date - 2020-11-29T06:06:01+05:30 IST
రైతుల పక్షాన ఉద్యమిస్తాం
మచిలీపట్నం టౌన్, నవంబరు 28 : నివర్ తుఫాను ధాటికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు శనివారం మండలంలోని చిన్నాపురం తదితర గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను సందర్శించి రైతులను పరామర్శించారు. రవీంద్ర మాట్లాడుతూ, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు వాస్తవంగా గణాంక వివరాలను సేకరించాలన్నారు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, తుపాను బీభత్సం వల్ల రైతులు అతలాకుతలమయ్యారన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా అందించాలన్నారు. రైతులకు నష్టపరి హారం అందకపోతే ఉద్యమిస్తామన్నారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్య నారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, రూరల్ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని, టీడీపీ జిల్లా కార్యదర్శి పి.వి. ఫణికుమార్, లంకే హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం నాయకుల పర్యటన
పోతేపల్లి, పొట్లపాలెం, కొత్తపూడి, బుద్దాలపాలెం, బొర్రపోతుపాలెం, హుస్సేన్పాలెం గ్రామాల్లో సీపీఎం మచిలీపట్నం కార్యదర్శి చౌటపల్లి రవి, నాయకులు పర్యటించారు. ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కొల్లాటి శ్రీనివాసరావు, సిహెచ్. జయరావు, బి. సుబ్రహ్మణ్యం, తమ్ము యువకిషోర్, తిరుమలరావు, మధు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.