శంబర జాతర ఏర్పాట్లపై సమీక్ష
ABN , First Publish Date - 2022-01-21T05:25:10+05:30 IST
శంబర పోలమాంబ జాతరను రాష్ట్ర పండగ్గా గుర్తించేటట్టు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. జాతర ఏర్పాట్లపై పార్వతీపురం ఐటీడీఏ పీవో రోణంకి కూర్మనాథ్తో కలిసి గురువారం సమీక్షించారు.
సాలూరు రూరల్/ మక్కువ, జనవరి 20: శంబర పోలమాంబ జాతరను రాష్ట్ర పండగ్గా గుర్తించేటట్టు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. జాతర ఏర్పాట్లపై పార్వతీపురం ఐటీడీఏ పీవో రోణంకి కూర్మనాథ్తో కలిసి గురువారం సమీక్షించారు. శంబర జాతర విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో శంబరకు దూరంగా చెక్పోస్టులు పెట్టి పోలీసులు ప్రజారవాణాను నిలుపుదల చేయనున్నారని, భక్తులు గమనించాలని తెలిపారు. మక్కువ మార్గంలో ఉన్న తోటవలస, కవిరిపల్లి, సన్యాసిరాజపురం గ్రామస్థుల రాకపోకలకు పోలీసులు ఇబ్బంది కలిగించకూడదన్నారు. పోలమాంబ ఆలయాభివృద్ధికి ప్రతిపాదనలు చేయాలని ఈవో లక్ష్మీనగేష్కు ఆదేశించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. మక్కువ జడ్పీటీసీ ఎం.శ్రీనివాసరావు, దేవస్థానం చైర్మన్ దాలినాయుడు, సాలూరు సీఐ అప్పలనాయుడు, అధికారులు పాల్గొన్నారు.