సతులకు బదులు పతులు..
ABN , First Publish Date - 2022-01-23T05:32:35+05:30 IST
సతులకు బదులు పతులు..
సమీక్ష సమావేశంలో పాల్గొన్న సర్పంచ్ల భర్తలు
చోద్యం చూసిన అధికారులు
పర్వత గిరి, జనవరి 22: మహిళా సాధికారత మాటల్లోనే గానీ చేతల్లో కనిపించడం లేదు. ఏకంగా రాష్ట్ర మంత్రి హాజరైన సమీక్ష సమావేశానికి మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలు హాజరుకావడం విమర్శలకు తావిస్తోంది. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూర్బన్ సహా ఇతర అభివృద్ధి కార్యక్ర మాలపై మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేష్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలు హాజరవడమే గాకుండా ఏకంగా సమస్యలపై జిల్లా అధికారులనే నిలదీశారు. విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన సమీక్షలో ఏకంగా మైక్లు పట్టుకుని దర్జాగా అధికారులను ప్రశ్నలు అడిగినా.. స్పందించేవారు కరువయ్యారు. మండలంలో 17 మంది మహిళా సర్పంచులు, ఎంపీపీ సహా 8 మంది మహిళా ఎంపీటీసీ సభ్యులు ఉండగా, అధికారికంగా నిర్వహించిన సమావేశానికి కేవలం ఒక మహిళా సర్పంచ్, ముగ్గురు మహిళా ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు. మిగతా మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు పాల్గొన్నారు. మంత్రి రాక ఆలస్యం కావడంతో ఎమ్మెల్యే రమేష్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో ఇలా భార్యలకు బదులు భర్తలు హాజరుకాగా ఎమ్మెల్యే సహా అధికారులు ఎవరూ నోరు మెదపకపోవడం పలువురు ముక్కున వేలేసుకున్నారు.