జీవీఎంసీ విభాగాధిపతులతో కమిషనర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2022-09-25T05:26:39+05:30 IST

జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు శనివారం ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో పలు విభాగాల అధిపతులతో సమీక్ష నిర్వహించారు.

జీవీఎంసీ విభాగాధిపతులతో కమిషనర్‌ సమీక్ష
సమీక్ష నిర్వహిస్తున్న కమిషనర్‌

పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా పలు అంశాలపై ఆరా

విశాఖపట్నం, సెప్టెంబరు 24: జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు శనివారం ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో పలు విభాగాల అధిపతులతో సమీక్ష నిర్వహించారు. తొలుత జీవీఎంసీ పరిపాలనా అధికారులతో సమావేశమై గ్రేటర్‌లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఏఏ స్థాయి అఽధికారులు పనిచేస్తున్నారు, వారికి పదోన్నతులు ఏ విధంగా కల్పిస్తారు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.


విద్యా విభాగపు అధికారులతో సమావేశమై జీవీఎంసీ పరిధిలో ఎన్ని ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, ఉన్నత పాఠశాలలు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఎంత మంది పనిచేస్తున్నారు, పాఠశాలల్లో మనం కల్పించే మౌలిక వసతులు ఎలావున్నాయి, గత విద్యాసంవత్సరం టెన్త్‌ ఉత్తీర్ణతా శాతం ఎంత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.


హార్టికల్చర్‌ విభాగం అధికారులతో మాట్లాడుతూ నగరంలో ఎన్ని పార్కులు ఉన్నాయి, వాటి నిర్వహణ ఏ విధంగా చేస్తారో ఏడీహెచ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కమిషనర్‌కు వివరించారు. కార్యదర్శి విభాగాల అఽధికారులతో మాట్లాడుతూ కౌన్సిల్‌ ఏర్పడినప్పటి నుంచి ఎన్ని సాధారణ సమావేశాలు నిర్వహించారు, స్థాయి సంఘ సమావేశాలు ఎన్ని నిర్వహించారు, ఎంత వరకు ఎన్ని పనులు ఏవిధంగా ఈ సమావేశాల ద్వారా ఆమోదిస్తారు తదితర వాటిని తెలుసుకున్నారు. పీఆర్‌వో విభాగం పనులను పీఆర్‌వో కమిషనర్‌కు వివరించారు. 


Updated Date - 2022-09-25T05:26:39+05:30 IST