రెవెన్యూ అధికారుల అత్యుత్యాహం.. ఎండుతున్న పంట
ABN , First Publish Date - 2021-08-04T04:23:27+05:30 IST
రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం మూలంగా వరిపంట ఎండిపోయిందని రైతులు కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన మిరుదొడ్డిమండలం మోతె గ్రామం శివారులో చోటుచేసుకున్నది.
మిరుదొడ్డి, ఆగస్టు 3 : రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం మూలంగా వరిపంట ఎండిపోయిందని రైతులు కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన మిరుదొడ్డిమండలం మోతె గ్రామం శివారులో చోటుచేసుకున్నది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని సర్వే నంబర్ 630, 631లో లింగం, స్వామి, లక్ష్మి, శ్రీధర్లకు చెందిన 21 ఎకరాల పట్టా భూమి ఉంది. పట్టా పత్రాలు ఉన్నప్పటికి కొంతమంది వ్యక్తులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఈ భూమిని కాజేయాలని చూస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు బోరు మోటారుకు సంబంధించిన పీజ్ను తీసుకెళ్లారు. సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నారు. దీంతో ఈ భూమిలో వెద పద్ధతిలో సాగు చేసిన వరి ఎండిపోయింది. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ బిక్షపతిని వివరణ కోరగా మోతె గ్రామంలో నెలకొన్న సమస్య తమ దృష్టికి వచ్చిందన్నారు. రెండుమూడు రోజుల్లో పరిష్కరించి, ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.