ఉద్యోగోన్నతుల జాబితాలో 17 మంది డీటీలు

ABN , First Publish Date - 2021-04-17T06:05:07+05:30 IST

దీర్ఘకాలంగా ఉద్యోగోన్నతుల కోసం ఎదురు చూస్తోన్న ఉప తహసీల్దార్ల(డీటీ)కు త్వరలోనే వారి కల నెరవేరనున్నది.

ఉద్యోగోన్నతుల జాబితాలో 17 మంది డీటీలు

విజిలెన్స్‌ నివేదిక కోరిన ప్రభుత్వం

గుంటూరు, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలంగా ఉద్యోగోన్నతుల కోసం ఎదురు చూస్తోన్న ఉప తహసీల్దార్ల(డీటీ)కు త్వరలోనే  వారి కల నెరవేరనున్నది. వారు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతులు పొందనున్నారు. జోన్‌-3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో  ఉద్యోగోన్నతులు అందుకోబోయే వారి సంఖ్య గుంటూరులోనే అత్యధికంగా ఉంది. జిల్లా నుంచి 17 మంది డీటీలకు తహసీల్దార్లుగా ఉద్యోన్నతులు రానున్నాయి. రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్‌ కార్యాలయం నుంచి డీటీల జాబితాని విజిలెన్స్‌ అదనపు సహాయక కమిషనర్‌ కార్యాలయానికి పంపించారు. ఆయా డీటీలపై  పెండింగ్‌ క్రమశిక్షణ చర్యలు/అభియోగాలు నమోదై ఉన్నాయో నివేదించాల్సిందిగా కోరారు.  గత ఐదేళ్ల వార్షిక రహస్య నివేదికలు కూడా పంపించాలని అదనపు సహాయక కమిషనర్‌(సర్వీసెస్‌) డీ రమాదేవి విజిలెన్స్‌కి లేఖ రాశారు. విజిలెన్స్‌ ఇచ్చే నివేదికల ఆధారంగా డీటీలకు ఉద్యోగోన్నతులు రానున్నాయి. సీసీఎల్‌ఏ స్థాయిలో ఉద్యోన్నతుల జాబితా సిద్ధం కావడంతో  డీటీలు తమ మీద ఉన్న పెండింగ్‌ క్రమశిక్షణ చర్యలు తొలగింపు చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తుది జాబితా విడుదలైతే కాని జిల్లాలో ఎవరెవరికి ఉద్యోగోన్నతి లభించిందనేది తెలుస్తుంది. 

Updated Date - 2021-04-17T06:05:07+05:30 IST