గవర్నర్‌తో సఖ్యతతో లేనప్పుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కష్టం: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-04-08T22:13:17+05:30 IST

వర్నర్ ఢిల్లీ పర్యటనతో కీలక అంశాలు చర్చకు వచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

గవర్నర్‌తో సఖ్యతతో లేనప్పుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కష్టం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: గవర్నర్ ఢిల్లీ పర్యటనతో కీలక అంశాలు చర్చకు వచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తక్షణమే తన అధికారాలను ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్‌కు లేని అధికారాలు..తెలంగాణ గవర్నర్‌కు ఉన్నాయని గుర్తుచేశారు.కుటుంబంలో ఉన్న సమస్యలను తప్పించుకునేందుకు.. కేసీఆర్‌ గవర్నర్‌ను సాకుగా చూపుతున్నారన్నారు.కేటీఆర్ తనను సీఎం చేయాలని కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కష్టమని..కేసీఆర్ కుటుంబ సభ్యులతో చెబుతున్నారన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వైద్య చేయించుకుంటున్నారంటే.. తెలంగాణలో వైద్యం పడకేసినట్లే కదా? అని ప్రశ్నించారు.టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుక్కలు, పిల్లులు, ఎలుకలు పెత్తనం చెలాయిస్తున్నాయని ఎద్దేవా చేశారు.వర్సిటీల్లో ఖాళీలున్నాయని గవర్నర్ అఫీషియల్‌గా నివేదిక ఇచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 


గవర్నర్ ఆవేదనలో మానవీయ కోణం

గవర్నర్ ఆవేదనలో మానవీయ కోణం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. గవర్నర్ తల్లి చనిపోతే సీఎం కేసీఆర్ పరామర్శించాల్సిందని చెప్పారు. పార్థీవదేహం కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాల్సిందన్నారు.తెలంగాణ సంపద తనదే అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని రేవంత్‌రెడ్డి  మండిపడ్డారు. 


కేసీఆర్‌కు కోపం వస్తుందనే వారిద్దరు రాజ్‌భవన్‌ రాలేదు?: రేవంత్‌రెడ్డి

రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..బండి సంజయ్‌ ఎందుకు రాలేదు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌కు కోపం వస్తుందనే కిషన్‌రెడ్డి, సంజయ్‌ రాలేదన్నారు. కిషన్‌రెడ్డి సిటీలో ఉండి ఎందుకు రాజ్‌భవన్‌కి వెళ్లలేదు?అని  రేవంత్‌రెడ్డి నిలదీశారు. 

Updated Date - 2022-04-08T22:13:17+05:30 IST