Munugode: ప్రజా సమస్యలపై, విధానాలపై మునుగోడులో చర్చ జరగాలి: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-14T19:35:01+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రజా సమస్యలపై కాకుండా.. వ్యక్తిగత విమర్శలపై చర్చ జరుగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

Munugode: ప్రజా సమస్యలపై, విధానాలపై మునుగోడులో చర్చ జరగాలి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రజా సమస్యలపై కాకుండా.. వ్యక్తిగత విమర్శలపై చర్చ జరుగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. ప్రజా సమస్యలపై, విధానాలపై మునుగోడు (Munugode)లో చర్చ జరగాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర విధానాలతో ప్రజలపై పడ్డ భారంపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదలు బ్రతకలేని పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. బీజేపీ (BJP) పాలనలో పేదలు, రైతులు, యువకులు మోసపోయారని తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పిందే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. 


మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో అన్ని పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక షెడ్యూల్‌ రాకముందే మునుగోడును అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తున్నాయి.నియోజకవర్గంపై ఎలాగైనా పట్టు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చండూర్‌లో బహిరంగ సభ నిర్వహించారు.

Updated Date - 2022-08-14T19:35:01+05:30 IST