KCRకు రేవంత్రెడ్డి లేఖ
ABN , First Publish Date - 2022-06-20T20:32:14+05:30 IST
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్య పరిష్కారానికి మీరు వెళ్లరు. మేమెళ్తామంటే అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బాసర వరకు అరెస్టులకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR)కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) లేఖ రాశారు. ‘‘బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్య పరిష్కారానికి మీరు వెళ్లరు. మేమెళ్తామంటే అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బాసర వరకు అరెస్టులకు పాల్పడుతున్నారు. విద్యార్థుల సమస్యలు సిల్లీ అంటూ మంత్రి హేళన చేశారు. సమస్య పరిష్కరిస్తామని కేటీఆర్ ట్వీట్ చేసి 5 రోజులైనా అతీగతీ లేదు. 8 ఏళ్లలో ఒక్క ఉన్నత విద్యాసంస్థను తేలేకపోయారు. లక్షల ఉద్యోగాలకు అవసరమైన అర్హత ఎక్కడి నుంచి వస్తుంది. వెంటనే మంత్రులు ట్రిపుల్ ఐటీని సందర్శించాలి. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని లేఖలో రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.
బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT) విద్యార్థుల ఆందోళన ఏడవ రోజుకు చేరింది. మెయిన్ గేటు వద్ద విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. కాగా విద్యార్థులతో గత అర్ధరాత్రి కలెక్టర్ జరిపిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఆందోళన విరమించాలని కలెక్టర్ సూచించారు. అయితే లిఖిత పూర్వక హామీ కావాలని విద్యార్థులు పట్టు బట్టారు. విద్యార్థులు వినకపోవడంతో కలెక్టర్ వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు యధావిధిగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.