మంత్రి కేటీఆర్ ఎక్కడా కనిపించరేం..? : రేవంత్
ABN , First Publish Date - 2020-09-27T18:51:17+05:30 IST
తెలంగాణ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం నాడు నగరంలోని
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం నాడు నగరంలోని ఎల్బీనగర్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటించారు. అనంతరం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అతని అనుచరులు చెరువులు, శిఖం భూములను కబ్జా చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. నగరంలో వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, అధికారులు పట్టించుకోవడం లేదని రేవంత్ మండిపడ్డారు.
ఎక్కడా కనిపించరేం!?
మంత్రి కేటీఆర్ ట్విట్టర్, వీడియోకాన్ఫరెన్స్లలో తప్ప ఎక్కడా కనిపించరేం..? అని ఆయన ప్రశ్నించారు. ఫ్లై ఓవర్ల ప్రారంభోత్సవాలకు కేటీఆర్ హాజరవుతారు కానీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాత్రం కేటీఆర్ రావట్లేదన్నారు. ఇదంతా ప్రకృతి వైపరీత్యం కాదు మానవ తప్పిదమని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ పనికిమాలిన అంశాలపై సమీక్షలు చేస్తున్నారే తప్ప, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలతో ఎల్బీనగర్లోని పలు కాలనీల ప్రజలకు భారీగా ఆస్తి నష్టం జరిగిందని.. నష్టం అంచనా వేసి తక్షణమే బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.