నాణ్యతలేని కందిపప్పు వెనక్కి ఇవ్వండి
ABN , First Publish Date - 2022-09-27T05:40:51+05:30 IST
డీలర్ల వద్ద కార్డుదారులకు పంపిణీ కాకుండా రేషన్ దుకాణాల్లో నిల్వవున్న నాణ్యత లేని, డ్యామేజ్డ్ కందిపప్పును ఎం.ఎల్.పాయింట్లలో వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్ సూచించారు.
డీలర్లకు పౌరసరఫరాల కమిషనరు ఆదేశం
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 26: డీలర్ల వద్ద కార్డుదారులకు పంపిణీ కాకుండా రేషన్ దుకాణాల్లో నిల్వవున్న నాణ్యత లేని, డ్యామేజ్డ్ కందిపప్పును ఎం.ఎల్.పాయింట్లలో వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్ సూచించారు. రేషన్ డీలర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు డీలర్లు సోమవారం విజయవాడలో ఆ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. డీలర్ల వద్ద పంపిణీ కాకుండా నిల్వవున్న నాణ్యతలేని కందిపప్పును సంస్థ డీఎంలు తీసుకోవడం లేదన్నారు. డీలర్షిప్ నిర్వహిస్తూ కరోనాలో మృతిచెందిన రేషన్ డీలర్ల కుటుంబసభ్యులకు అంత్యక్రియల ఖర్చులకు గాను రూ.15 వేలు చెల్లించేందుకు ఎండీ అంగీకరించారు. డీలర్ల వద్ద వున్న కాటాకు స్టాంపింగ్ వేసేందుకు చార్జి రూ.300 మాత్రమే తూనికలు, కొలతలు అధికారులకు చెల్లిస్తే సరిపోతుందని ఎండీ పేర్కొన్నారు. అంతకుముందు డీలర్లు జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎండీ దృష్టికి తీసుకొచ్చారు.