కోర్టులో లొంగిపోయిన మాజీ తహసీల్దారు

ABN , First Publish Date - 2022-06-29T07:43:02+05:30 IST

కృష్ణపట్నం పోర్టు భూముల కేసులో నిందితురాలైన మాజీ తహసీల్దారు గీతావాణి మంగళవారం గూడూరు కోర్టులో లొంగిపోయారు.

కోర్టులో లొంగిపోయిన మాజీ తహసీల్దారు

కృష్ణపట్నం పోర్టు భూముల కేసు

చిల్లకూరు, జూన్‌ 28: కృష్ణపట్నం పోర్టు భూముల  కేసులో నిందితురాలైన మాజీ తహసీల్దారు గీతావాణి మంగళవారం గూడూరు కోర్టులో లొంగిపోయారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నం సమీపంలో పోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ పేరుతో ఉన్న 209 ఎకరాల భూములను గతేడాది జూన్‌ నెలలో అప్పటి తహసీల్దారు గీతావాణి, ఆర్‌ఐ సీరాజ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నవీన్‌ 10మంది  పేర్లతో ఆన్‌లైన్‌ మ్యూటేషన్‌ చేశారు. గతేడాది జూలైలో ఈ విషయం వెలుగుచూడడంతో అప్పటి కలెక్టర్‌ చక్రధర్‌బాబు గూడూరు ఆర్డీవో మురళీకృష్ణను విచారణ అధికారిగా నియమించారు. ఆర్డీవో విచారణ నిర్వహించి జరిగిన అక్రమాలు వాస్తవమేనని తేల్చారు.దీంతో తహసీల్దారు గీతావాణి, ఆర్‌ఐ సిరాజ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నవీన్‌ను సస్పెండ్‌ చేశారు. గతేడాది సెప్టెంబరు 25వ తేదీన చిల్లకూరు పోలీసుస్టేషన్‌లో ఈ కేసుకు సంబంధించి ఆర్డీవో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు గీతావాణి, సిరాజ్‌, నవీన్‌ తదితరులపై కేసు నమోదు చేశారు.ఆరుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. తహసీల్దారు, ఆర్‌ఐ తదితరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం మాజీ తహసీల్దారు గీతావాణి లాయర్‌ సహకారంతో కోర్టులో జడ్జి ముందు లొంగిపోయారు. దీంతో ఆమెకు 14 రోజులు రిమాండ్‌ విధించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ఆరోగ్యపరీక్షల కోసం పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షల అనంతరం జైలుకు పంపారు. 


Updated Date - 2022-06-29T07:43:02+05:30 IST