16నుంచి బడులు పున:ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-24T07:24:41+05:30 IST

రాష్ట్రంలో ఆగస్టు 16నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా కానుక ప్రారంభించడంతో పాటు నూతన విద్యావిధానంపై అదే రోజు సమగ్రంగా వివరించనుంది

16నుంచి బడులు పున:ప్రారంభం

రెండో విడత పనులకు శ్రీకారం, విద్యాకానుక ప్రారంభం 

నూతన విద్యావిధానం విధి విధానాలపై ప్రకటన కూడా 

5వ తరగతి వరకు బీఈడీ, పీజీ చేసిన టీచర్లతో బోధన 

ఏ స్కూలునూ మూసేయం... ఎవ్వరినీ తొలగించం 

పనుల్లో ఎక్కడా అవినీతి ఉండకూడదు: సీఎం జగన్‌ 

మొదటి విడత ‘నాడు-నేడు’ పనులు ప్రజలకు అంకితం


అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆగస్టు 16నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా కానుక ప్రారంభించడంతో పాటు నూతన విద్యావిధానంపై అదే రోజు సమగ్రంగా వివరించనుంది. విద్యాశాఖలో ‘నాడు-నేడు’, అంగన్‌వాడీలపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆగస్టు 16నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడత ‘నాడు-నేడు‘ పనులను అదేరోజు ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. అనంతరం రెండో విడత పనులకు కూడా శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ‘‘పిల్లల భవిష్యత్తు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం. ఎక్కడా అవినీతికి, వివక్షకు తావుండకూడదు. ఇలాంటి ఆలోచన గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. పిల్లల చదువుల కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వమూ లేదు. పారదర్శకంగా పనులు సాగాలి. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు’’ అని జగన్‌ స్పష్టం చేశారు. నూతన విద్యా విధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు, మెరుగులు దిద్దే ప్రక్రియను పూర్తిచేసి ఆగస్టు 16న విధివిధానాలు వెల్లడించాలని ఆదేశించారు. కొత్త విద్యావిధానంలో పీపీ-1 నుంచి 12వ తరగతి వరకూ ఆరు రకాల స్కూళ్లు వస్తాయన్నారు. శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లు(పీపీ-1, పీపీ-2), ఫౌండేషన్‌ స్కూళ్లు(పీపీ-1, పీపీ-2, 1, 2 తరగతులు), ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లు (పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5 తరగతులు), ప్రీ హైస్కూళ్లు(పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు), హైస్కూళ్లు(3 నుంచి 10వ తరగతి వరకూ), హైస్కూల్‌ ప్లస్‌(3నుంచి 12వ తరగతి వరకూ) రానున్నాయని సీఎం వివరించారు.


‘‘శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్‌ ప్రతి ఆవాసంలో ఉంటుంది. కిలోమీటరు లోపలే ఫౌండేషన్‌ స్కూల్‌ ఏర్పాటవుతుంది. 3కి.మీ. పరిధిలో హైస్కూల్‌ ఉంటుంది. ఆ పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు. వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యావిధానాన్ని అమలు చేయబోతున్నాం’’ అని జగన్‌ పేర్కొన్నారు. ‘‘ఉపాధ్యాయులను అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవడమే నూతన విద్యావిధానపు ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం 5వ తరగతి వరకూ ప్రతి టీచర్‌ 18 రకాల సబ్జెక్టులు బోధిస్తున్నారు. కొన్నిచోట్ల సుమారు 200 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు, మరి కొన్నిచోట్ల నలుగురికి ఒకే టీచర్‌ బోధిస్తున్న పరిస్థితి ఉంది. నూతన విధ్యావిధానంలో ఈ పరిస్థితుల్లో మార్పు తెస్తున్నాం. 5వ తరగతి వరకు 18సబ్జెక్టులను బీఈడీ, పీజీ చేసిన టీచర్లతో బోధన అందించబోతున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ రాబోతున్నారు’’ అని సీఎం చెప్పారు. 


ఈ విధానంపై అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని అధికారులను ఆదేశించారు. ఫౌండేషన్‌ స్కూళ్లు, నూతన విద్యావిధానంపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలపై సీఎం ప్రశ్నించారు. ఇప్పటికే వివిధ సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించామని అధికారులు చెప్పారు. నూతన విద్యావిధానం వల్ల కలిగే ప్రయోజనాలు తల్లిదండ్రులకు కూడా తెలిసేలా విస్తృతంగా అవగాహన కలిగించాలని జగన్‌ నిర్దేశించారు. ‘‘నాడు-నేడు, నూతన విద్యావిధానం కోసం సుమారు రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీనిద్వారా సాధించబోయే లక్ష్యాలను స్పష్టంగా చెప్పాలి. టీచర్లకు కూడా దీనిపై సమగ్ర అవగాహన కలిగించాలి. అంగన్‌వాడీలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు వారికీ ప్రమోషన్‌ చానల్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఏ స్కూలునూ మూసేయం, ఎవ్వరినీ తొలగించం’’ అని సీఎం స్పష్టం చేశారు. ఆగస్టు 16 నాటికి అంతా సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. వరుసగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్‌ విద్యార్థులను పాస్‌ చేశామని, కొన్ని రిక్రూట్‌మెంట్లలో మార్కులను పరిగణనలోకి తీసుకుంటుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని అధికారులు ప్రస్తావించారు. దీంతో అంతర్గత పరీక్షల ఆధారంగా 2020 టెన్త్‌ విద్యార్థులకూ మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. 2021 టెన్త్‌ విద్యార్థులకూ స్లిప్‌టెస్ట్‌లో మార్కుల ఆధారంగా 70శాతం, ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌ ఆధారంగా 30 శాతం మార్కులు ఇస్తామని, వాటిప్రకారం గ్రేడ్లు ఇస్తామని సీఎంకు అధికారులు వివరించారు. 

Updated Date - 2021-07-24T07:24:41+05:30 IST