న్యూస్ పేపర్ మళ్లీ ప్రారంభించండి: సీఎంకు మాజీ సీఎం సలహా
ABN , First Publish Date - 2020-04-05T00:06:15+05:30 IST
న్యూస్ పేపర్ మళ్లీ ప్రారంభించండి: సీఎంకు మాజీ సీఎం సలహా
ముంబై: రాష్ట్రంలో వార్తా పత్రికల పంపిణీని తిరిగి ప్రారంభించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్విరాజ్ చవాన్ కోరారు. చాలా మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదని దీంతో ప్రజలు తగిన సమాచారం తెలుసుకోలేక పోతున్నారని సీఎంకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
వార్తా పత్రికలు తమ వద్దకు రాకపోవడానికి ప్రభుత్వమే కారణమని ప్రజలు అనుకుంటున్నారని ఈ అపవాదును ప్రభుత్వం చెరిపి వేసుకోవాలంటే వెంటనే వార్త పత్రికల పంపిణీ ప్రారంభించాలని పృథ్విరాజ్ అన్నారు. వెంటనే పత్రికా యాజమాన్యాలు, పంపిణీదారులతో మాట్లాడాలని, వారికి తగిన రక్షణ కల్పించి వార్త పత్రికల పంపిణీ పున:ప్రారంభించాలని అన్నారు.
ఇక రాష్ట్రంలో వలస కూలీలు చాలా ఎక్కువగా ఉన్నారని, వారికి ఆహారంతో పాటు పోషణ అందించాలని ఉద్దవ్కు రాసిన లేఖలో చవాన్ పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నారులకు వెంటనే ఆహారం అందించాలని, వారు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన అన్నారు. దీని కోసం ఒక హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేయాలని పృథ్విరాజ్ అన్నారు.