భీమ్లా నాయక్ సినిమాపై ఆగని ఆంక్షలు.. ప్రభుత్వం ఉక్కుపాదం
ABN , First Publish Date - 2022-02-24T22:30:33+05:30 IST
భీమ్లా నాయక్ సినిమాపై ప్రభుత్వ ఆంక్షలు ఆగలేదు. భీమ్లా నాయక్ సినిమాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సినిమా థియేటర్ల యజమానులకు నేరుగా
అమరావతి: భీమ్లా నాయక్ సినిమాపై ప్రభుత్వ ఆంక్షలు ఆగలేదు. భీమ్లా నాయక్ సినిమాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సినిమా థియేటర్ల యజమానులకు నేరుగా నోటీసులిస్తున్నారు. థియేటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సీజ్ చేస్తామని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. జీఓ నెంబరు 35 ప్రకారం టిక్కెట్ ధరలు వసూలు చేయాలని ఆదేశించారు. బెనిఫిట్ షోలు, అదనపు షోలకు అనుమతి లేదని లిఖిత పూర్వక ఆదేశాలిచ్చారు. సినిమా విడుదలయ్యే శుక్రవారం రోజున థియేటర్ల దగ్గర నిఘా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్మితే కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. 5వ ఆటకు అనుమతి లేదని స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని బెజవాడలో హీరో పవన్ కల్యాణ్ అభిమానుల ఆందోళనకు దిగారు. ఏపీ ప్రభుత్వం తీరుపై పవన్ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో అధికారులు మళ్లీ థియేటర్లపై పడ్డారు. భీమ్లానాయక్ సినిమా విడుదల అవుతుండడంతో తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు. జీవో నంబరు 35 ప్రకారం ఆన్లైన్ విధానం ద్వారా టికెట్ల అమ్మకం చేపట్టాలని యాజమాన్యానికి సూచించారు. ఎవరైనా బ్లాక్లో టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. థియేటర్లో టాయిలెట్ల నిర్వహణ సరిగా ఉండాలని, తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో చాలా థియేటర్లకు తహశీల్దార్లు నోటీసులు జారీ చేశారు. ‘అదనపు షోలు వేయవద్దు. టికెట్లను అధిక ధరలకు అమ్మవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం’ అని అందులో తెలిపారు. ఇక... రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల థియేటర్ల యజమానులను పిలిపించి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.