BRS: టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం

ABN , First Publish Date - 2022-10-05T18:46:41+05:30 IST

టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సమావేశం ముందు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టారు

BRS: టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సమావేశం ముందు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బలపర్చారు. అయితే మధ్యాహ్నం 1:19 గంటలకు కేసీఆర్ కూడా ఆమోదించనున్నారు. పార్టీ జెండా, ఎజెండాపై ఆయన వివరిస్తారు. కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైనారు. జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరైనారు. టీఆర్ఎస్ పేరు మార్పుపై తీర్మానం చేశారు. అనంతరం సంతకాల సేకరించారు.



తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. ఇకపై భారత రాష్ట్ర సమితిగా మారనుంది. తెలంగాణ పరిధి నుంచి జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందనుంది. ఉద్యమ పార్టీ నుంచి.. ప్రాంతీయ పార్టీ అధినేతగా మొదలైన కేసీఆర్‌ ప్రస్థానం జాతీయ పార్టీ అధ్యక్షుడి స్థాయికి చేరనుంది. విజయదశమి రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్‌ జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ జెండా ఇప్పుడున్నట్లు గులాబీ రంగులోనే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడున్న జెండానే ఉండనుంది. పార్టీ గుర్తు కూడా కారే ఉంటుంది. ఆ గుర్తే ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడగనున్నారు. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ పార్టీని 2001లో రిజిస్ట్రేషన్‌ చేసినప్పుడు.. పార్టీ పరిధిని తెలంగాణ ప్రాంతం వరకే పేర్కొన్నారు.  పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితిగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పార్టీ పేరు స్థానంలో భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)అని మార్చనున్నారు.


సభ్యత్వం పెంచాలి

జాతీయ పార్టీగా ఏర్పడ్డాక తెలంగాణలో కూడా ఇప్పుడున్న సభ్యత్వం సరిపోదని, భారీగా పార్టీ సభ్యత్వం పెంచాలని కేసీఆర్‌ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బయటి రాష్ట్రాల నుంచి కూడా మంచి స్పందన ఉందని.. పార్టీ పెట్టిన సత్వరమే ఆదరణ లభిస్తుందని తెలిపారు. పార్టీ నేతలకు జాతీయ స్థాయి కూడా అవకాశాలు వస్తాయని.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ తరఫున ఇన్‌చార్జులుగా పనిచేసే అవకాశం, అదేవిధంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైతే గవర్నర్‌ అవకాశాలు తదితరాలు వస్తాయని అన్నట్లు తెలిసింది. పార్టీలోని కీలక నేతలకు ఏయే బాధ్యతలు అప్పగించాలన్న దానిపైనా చర్చించినట్లు సమాచారం. 

Updated Date - 2022-10-05T18:46:41+05:30 IST