ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతిఘటన తప్పదు
ABN , First Publish Date - 2021-10-20T05:54:15+05:30 IST
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రతిఘటన తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు అన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు
కొండపి, అక్టోబరు 19: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రతిఘటన తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు అన్నారు. మంగళవారం పెరిదేపి గ్రామంలో జరిగిన సీపీఎం మండల మహాసభలో ఆయన మాట్లాడా రు. సభ ప్రారంభానికి ముందు సీనియర్ నాయకుడు అంగలకుర్తి బ్రహ్మయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. గుమ్మళ్ల వెంకటేశ్వర్లు, మల్లెల కొండయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆంజనేయులు మా ట్లాడుతూ కరోనా కాలంలో పేదల ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి అవస్థలు పడితే, సంపన్నుల ఆదాయాలు రెట్టింపయ్యాయన్నారు. బీజేపీ కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలను అవలంభిస్తున్నం దువల్లనే ఇది సాధ్యపడిందన్నారు. అంబానీ, ఆదానీలకు దేశ సంపదను దోచిపెడుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసీపీ విధానాలతో కరెంటు కష్టాలు ఏర్పడ్డాయన్నారు. బీజేపీ, వైసీపీ సామాన్యులపై భారం మోపుతూ, కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నాయన్నారు.
సమావేశంలో పార్టీ నాయకులు కంకణాల ఆంజనేయులు, కేజీ మస్తాన్, మల్లెల పెదపేతురు, గడ్డం వందనం, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.