రాజీనామా చేస్తున్నా
ABN , First Publish Date - 2022-08-03T08:29:04+05:30 IST
కొద్దిరోజులుగా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు సంకేతాలిస్తున్న మునుగోడు శాసనసభ్యుడు కోమటి రాజగోపాల్ రెడ్డి..
- కాంగ్రెస్కు, ఎమ్మెల్యే పదవికి.. 2 రోజుల్లో స్పీకర్కు సమర్పిస్తా
- అధిష్ఠానం తీరు బాధ కలిగించింది..
- 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా పిలిపించి మాట్లాడలేదు
- 20 ఏళ్లపాటు కాంగ్రెస్ను, సోనియాను తిట్టిన
- రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయలేను
- అవమానాలు భరించాల్సిన అవసరం లేదు
- బీజేపీలో చేరేదీ లేనిదీ త్వరలోనే చెబుతా
- ఉప ఎన్నికలతోనే నియోజకవర్గ అభివృద్ధి
- నయా నిజాం మాదిరిగా కేసీఆర్ పాలన
- కేసీఆర్ కుటుంబ అరాచక పాలన పోవాలంటే..
- అది నరేంద్ర మోదీ, అమిత్షాతోనే సాధ్యం
- కేంద్రంలో మరోసారి మోదీసర్కారే వస్తుంది
- మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కొద్దిరోజులుగా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు సంకేతాలిస్తున్న మునుగోడు శాసనసభ్యుడు కోమటి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో స్పీకర్ను కలసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు సోనియా, రాహుల్ గాంధీ అంటే గౌరమని.. అందుకే విమర్శలు చేయడం లేదని, అయితే కాంగ్రెస్ అధిష్ఠానం తీరు తనను ఎంతగానో బాధించిందని వివరించారు. ఎంతో బాధతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీ బలహీన పడిందని.. అలాగే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా బలహీనపడిందని వ్యాఖ్యానించారు. అవమానాలను భరిస్తూ కాంగ్రెస్లో ఉండాల్సిన అవసరం.. బయట నుంచి వచ్చిన రేవంత్రెడ్డి లాంటి వారి నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. కనీసం కమిటీల ఏర్పాటులో కూడా తమను భాగస్వాములను చేయలేదని.. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడి టీఆర్ఎ్సలో చేరితే అధిష్ఠానం కనీసం పిలిచి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచానని.. ఎన్నికల్లో అనేక మంది అభ్యర్ధులకు ఆర్థికసాయం చేశానని చెప్పుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు.. 20 ఏళ్లపాటు కాంగ్రెస్ను, సోనియాను తిట్టిన వ్యక్తి కింద పనిచేయాలంటున్నారని నిర్వేదంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తమకు గౌరవం లేదన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తికి పెద్దపీట వేయడం ఎంతవరకు సబబు అని అధిష్ఠానాన్ని ప్రశించారు. అటువంటి వ్యక్తులా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చేదని ప్రశ్నించారు. కాంగ్రెస్లో తమకు అవమానం జరిగిందని, డిపాజిట్ రాని వ్యక్తులు చెబితే తాము వినబోమని తేల్చిచెప్పారు. బయటనుంచి వచ్చిన వ్యక్తులు కాంగ్రెస్ను కబ్జా చేశారని, అటువంటి వ్యక్తులను సీఎం చేస్తారా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తన సోదరుడు తనతోపాటు వస్తారా రారా అనే విషయం తనకు తెలియదని.. దాని గురించి ఆయన్నే అడగాలని మీడియాకు సూచించారు.
ఆ పార్టీలో ఉంటా..
తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరంగా ఉందని.. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనూ శ్రీలంక తరహా పరిస్థితులు వస్తాయని ఆయన హెచ్చరించారు. 1400 మంది బలిదానాలతో తెలంగాణ వస్తే.. ఇప్పుడది కేసీఆర్ కుటుంబ పాలన కోసమే ఉపయోగపడుతోందని, దేశంలో ఇంతటి ఘోరమైన పాలన ఏ రాష్ట్రంలోనూ లేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలన నయా నవాబులా ఉందని నిప్పులు చెరిగారు. కొద్దిమందే సంపదను అనుభవిస్తున్నారని, పార్టీలు మారిన వారికి దోచిపెడుతున్నారని విమర్శించారు.రాష్ట్రంలో ప్రతిపక్షాలకు గౌరవం లేదని.. ఒక ఎస్సీ నేత శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉంటే కేసీఆర్ సహించలేకపోయారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో తాను కాంగ్రె్సతో ఉండి చేసేదేమీ లేదని.. తన పోరాటమంతా కేసీఆర్ కుటుంబపాలనపైన, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమేనని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఏ పార్టీ కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడుతుందో ఆ పార్టీలో ఉంటానన్నారు. భారతదేశం ప్రధాని మోదీ నాయకత్వంలో దూసుకుపోతోందని.. కేంద్రంలో మూడోసారి కూడా బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ ఆరాచక పాలన పోవాలంటే.. అది మోదీ అమిత్ షా వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరేదీ లేనిదీ త్వరలోనే ప్రకటిస్తానని.. కుటుంబసభ్యులు, సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరుతున్నాన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ విషయానికి సంబంధించి తనపై సోషల్ మీడియాలో తప్పు డు ప్రచారాలు చేయడం బాఽధించిందన్నారు. సొంతపార్టీ నేతలతో పాటు ఇతరులు తనపై ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఛత్తీ్సగఢ్లో తనకు వచ్చిన కాంట్రాక్టు కూడా.. గ్లోబల్ టెండర్ల ద్వారా దక్కిం దే తప్ప రాజకీయాలను అడ్డం పెట్టుకుని తెచ్చుకుంది కాదని గుర్తుచేశారు. తాను డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసమే పార్టీ మారేవాడినైతే ఎప్పుడో మారేవాడినని.. టీఆర్ఎ్సలో చేరాలంటూ 2014 నుంచి తనకు ఎన్నోసార్లు ఆహ్వానం అందినా తిరస్కరించానని తెలిపారు. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తేనే నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతోందని.. తన రాజీనామాతో మునుగోడు అభివృద్ధి అవుతుందనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాతోనైనా సీఎం కేసీఆర్కు కనువిప్పు కలుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.