పారిశుద్ధ్య కార్మికులపై పూల వర్షం కురిపించిన కాలనీ వాసులు

ABN , First Publish Date - 2020-04-01T19:35:47+05:30 IST

కరోనా వైరస్‌ను పారదోలేందుకు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నిత్యం వీధులను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య..

పారిశుద్ధ్య కార్మికులపై పూల వర్షం కురిపించిన కాలనీ వాసులు

పటియాలా: కరోనా వైరస్‌ను పారదోలేందుకు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వీధులను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై ఓ కాలనీ వాసులు తమదైన శైలిలో కృతజ్ఞత చాటుకున్నారు. వారిపై పూలవర్షం కురిపించి కరతాళ ధ్వనులతో అభినందించారు. పంజాబ్‌లోని పటియాలా జిల్లా నభా పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో వైరల్‌గా మారింది. పారిశుద్ధ్య కార్మికులు ఓ తోపుడు బండితో వీధిలోకి రాగానే కాలనీ వాసులంతా తమ ఆపార్ట్‌మెంట్ల నుంచి పూలు చల్లుతూ చప్పట్లు కొట్టారు. మరికొందరైతే నోట్ల దండలు మెడలో వేసి సత్కరించారు.


దీనిపై హర్షం వ్యక్తం చేసిన పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్... ట్విటర్లో ఈ వీడియో షేర్ చేసుకున్నారు. ‘‘పారిశుద్ధ్య కార్మికుడిపై నభా ప్రజలు ప్రేమాభిమానాలు  చాటుకోవడం చూసి సంతోషం కలిగింది. ఈ కష్టకాలం మనందరిలోని మంచితనాన్ని బయటికి తీసుకురావడం హర్షణీయం. కోవిడ్-19పై పోరాడుతున్న యోధులకు ఇదే రీతిగా ప్రోత్సాహాన్ని కొనసాగిద్దాం..’’ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఓ వైపు కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. ఈ మహమ్మారిపై వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, అత్యవసర సేవల సిబ్బంది నిత్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. 



Updated Date - 2020-04-01T19:35:47+05:30 IST