వడ్డింపు పక్కా !
ABN , First Publish Date - 2022-08-05T06:08:55+05:30 IST
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం వెలువరించే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి.
నేడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం
అర శాతం వరకు రెపో రేటు పెంచే చాన్స్
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం వెలువరించే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఇప్పటికే అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా ఏడు శాతంపైనే ఉంది. దీంతో జీడీపీ వృద్ధి రేటును పెద్దగా దెబ్బతీయకుండా.. కీలక రెపో రేటు మరింత పెంపునకే ఆర్బీఐ ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నారు. ఈ పెంపు మరో 35 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
పెరగనున్న ఈఎంఐల భారం: రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఇప్పటికే మే-జూన్ నెలల్లో రెండు విడతలుగా ఆర్బీఐ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) పెంచింది. దీంతో గత రెండు నెలల్లో అనేక బ్యాంకులు తమ వడ్డీ రేట్లు పెంచాయి. శుక్రవారం వెలువడే ద్రవ్య, విధాన సమీక్షలోనూ ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం ఖాయమని తేలిపోయింది. ముందే ఈ పెంపును ఊహించి చాలా బ్యాంకులు ఇప్పటికే రుణాలపై వడ్డీ రేట్లు పెంచేశాయి. ఆర్బీఐ నిర్ణయం తర్వాత బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దాంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై నెలనెలా చెల్లించే ఈఎంఐల భారం మరింత పెరగనుంది.
ఇతరుల కంటే తక్కువే: కీలక వడ్డీ రేట్ల పెంపులో ఇతర కేంద్ర బ్యాంకులతో పోలిస్తే ఆర్బీఐ ఇప్పటికీ వెనకబడే ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బీఓఈ) గురువారం తన కనీస వడ్డీ రేటును అర శాతం పెంచేసింది. అమెరికా ఫెడ్ రిజర్వ్, యూరోపియన్ కేంద్ర బ్యాంకులు ఇదేబాటలో నడుస్తున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలు ప్రస్తుతం అమెరికా, ఈయూ దేశాలను మరింత వణికిస్తున్నాయి. భారత్కు ఆ ముప్పు లేకపోవడంతో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ రెపో రేటు పెంచే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.