సర్వశిక్షా అభియాన్ ఏఎంవోకు వినతిపత్రం అందిస్తున్న భాషా వలంటీర్ల సంఘం నాయకులు
పాడేరురూరల్, జనవరి 24: ఆదివాసీ భాషా వలంటీర్లను రెన్యువల్ చేయాలని కోరుతూ సర్వశిక్షా అభియాన్ ఏఎంవో శ్రీనివాసరావుకు గిరిజన సంఘం, భాషా వలంటీర్ల సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు మాట్లాడుతూ..గిరిజన తెగల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు మాతృ భాషా విద్యా అభివృద్ధి పథకాన్ని గత ప్రభుత్వాలు అమలు చేశాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ విద్యా సంవత్సరం భాషా వలంటీర్లను రెన్యువల్ చేయకపోవడంతో విశాఖ మన్యంలోని 708 మంది వలంటీర్లు రోడ్డున పడ్డారన్నారు. అధికారులు తక్షణమే స్పందించి వలంటీర్లను రెన్యువల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం, భాష వలంటీర్ల సంఘం నాయకులు కె.నర్సయ్య, పి.కుమారి, కె.సర్బునాయుడు, పి.శ్రీను, చంద్రయ్య పాల్గొన్నారు.