నిర్బంధ ఓటుతోనే గణతంత్ర ఫలాలు

ABN , First Publish Date - 2021-01-26T06:47:16+05:30 IST

1946 నవంబరులో ఏర్పాటైన భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీలోని ఏడుగురు సభ్యులు పూర్తి కాలం సహకరించకున్నా- బి.ఆర్. అంబేడ్కర్ తాను...

నిర్బంధ ఓటుతోనే గణతంత్ర ఫలాలు

1946 నవంబరులో ఏర్పాటైన భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీలోని ఏడుగురు సభ్యులు పూర్తి కాలం సహకరించకున్నా- బి.ఆర్. అంబేడ్కర్ తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాకారం చేయడం కోసం అహర్నిశలు పని చేసి భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న పౌరులకు అందుబాటులోకి తెచ్చారు. భారత రాజ్యాంగం అందుబాటులోకి వచ్చేనాటికి ప్రజలందరికీ ఓటు హక్కు లేదు. కేవలం పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. తదనంతరం ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు 21ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించింది. అది తర్వాత 18 సంవత్సరాలుగా సవరణ అయింది. నిర్బంధ విద్య, నియంత్రిత సాగును సమర్థిస్తున్న ప్రభుత్వాలు ఈ దేశంలో నిర్బంధ ఓటింగును ఎందుకు అమలుపరచకూడదో కూడా ఒకమారు ఆలోచించాలి. సమర్థులైన, విచక్షణ గల పౌరులు ఓటింగులో పాల్గొనకపోవడం వల్లనే అక్రమార్కులు రాజకీయాలలోకి చొరబడుతున్నారు. అందరూ ఓట్లు వేస్తే నిస్వార్థ నాయకులు, నిజాయితీగల యువత రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తుంది. అప్పుడే మన తలరాతలు మారతాయి. ఓటు వేయనివారి పౌరసత్వాన్ని వీలైతే రద్దు చేయాలి. వారికి ప్రభుత్వ పథకాల వల్ల లభించే సౌకర్యాలు అన్నీ నిలిపివేయాలి. పథకాలను కేవలం ఆధార్ కార్డు ప్రాతిపదికన కాకుండా ఓటర్ గుర్తింపు కార్డు ప్రాతిపదికన అందించాలి. కేవలం బ్యాలెట్ బాక్స్ లోనే కాకుండా, ఇంటర్నెట్ ద్వారా, మొబైల్ ద్వారా, ఈ సేవ సెంటర్ల ద్వారా, పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని పౌరులకు కల్పించి ఓటుశాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. అప్పుడే అధికారం సామాన్యుడి చేతిలోకి వస్తుంది. అవినీతి అంతమొందుతుంది. గణతంత్ర ఫలాలు ప్రజలకు అందుతాయి.

దాసు సురేశ్

Updated Date - 2021-01-26T06:47:16+05:30 IST