‘సాయినార్’ ప్రమాదంపై కలెక్టర్కు నివేదిక
ABN , First Publish Date - 2020-07-05T09:44:10+05:30 IST
పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో ప్రమాదంపై విశాఖ ఆర్డీవో కె. పెంచల కిశోర్ నేతృత్వంలో విచారణ కమిటీ
విశాఖపట్నం, జూలై 4(ఆంధ్రజ్యోతి): పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో ప్రమాదంపై విశాఖ ఆర్డీవో కె. పెంచల కిశోర్ నేతృత్వంలో విచారణ కమిటీ శనివారం కలెక్టర్ వినయ్చంద్కు నివేదిక అందజేశారు. హైడ్రోజన్ సల్ఫైడ్ గాఢత వల్లే ఇద్దరు ఉద్యోగులు చనిపోగా మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఆర్డీవో నేతృత్వంలో కర్మాగార విభాగం డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం రామలింగరాజు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ప్రసాదరావుతో కూడిన కమిటీ విచారించింది. కంపెనీలో బెంజ్మిడజోల్ ఉత్పత్తి చేసే క్రమంలో ఘన పదార్థం వేరుచేసిన తరువాత మదర్ లిక్కర్ను రియాక్టర్లోకి పంపే క్రమంలో రియాక్టర్ బయట అమర్చాల్సిన హోస్ పైపును బిగించకుండా నేరుగా లోపల పెట్టడంతో ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని నివేదికలో పొందుపరిచారని తెలిసింది.