నివేదిక రెడీ.. నిధులే తరువాయి

ABN , First Publish Date - 2021-08-04T05:44:33+05:30 IST

తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 4న సందర్శించనున్నారు. కాగా, సీఎం పర్యటన వివరాలను అధికారికంగా జిల్లాయంత్రాంగం వెల్లడించనప్పటికీ కాగా, గ్రామాన్ని సీఎం దత్తత తీసుకోవడంతో అధికారులు అభివృద్ధి సమగ్ర నివేదికను రూపొందించారు.

నివేదిక రెడీ.. నిధులే తరువాయి

నేడు వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌

రైతువేదిక వద్ద రైతులతో భేటీ

గ్రామాభివృద్ధికి ప్రత్యేక కమిటీలు

రూ.2.16కోట్లతో సబ్‌స్టేషన్‌8 రోడ్డు విస్తరణకు సర్వే

గ్రామస్థుల హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం


(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 4న సందర్శించనున్నారు. కాగా, సీఎం పర్యటన వివరాలను అధికారికంగా జిల్లాయంత్రాంగం వెల్లడించనప్పటికీ కాగా, గ్రామాన్ని సీఎం దత్తత తీసుకోవడంతో అధికారులు అభివృద్ధి సమగ్ర నివేదికను రూపొందించారు. సీఎం పర్యటన నేపథ్యంలో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.


సీఎం కేసీఆర్‌ 2020, అక్టోబరు 31న వరంగల్‌ వెళ్లివస్తూ వాసాలమర్రిలో కొద్దిసేపు ఆగి గ్రామస్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత సీ ఎం స్వయంగా వాసాలమర్రి సర్పంచ్‌కు ఫోన్‌ చేసి ఈ ఏడాది జూన్‌ 22న గ్రామానికి వస్తున్నట్లు తెలిపారు. అన్నట్టుగానే గ్రామంలో పర్యటించిన సీఎం, గ్రామస్థులతో సహపంక్తి భోజనాలు చేసి గ్రామసభ నిర్వహించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని నాడు అధికారులను ఆదేశించారు. అందుకు ప్రత్యే క అధికారిగా కలెక్టర్‌ పమేలాసత్పథిని నియమించి దిశానిర్దేశం చేశా రు. అదేవిధంగా జిల్లాలోని ప్రతీ పంచాయతీ కి రూ.25లక్షలు, భువనగిరి మునిసిపాలిటీ కి రూ.1కోటి, మిగతా మునిసిపాలిటీల కు రూ.50లక్షలు కేటాయించనున్న ట్టు సీఎం ప్రకటించారు. ఆ మేర కు జిల్లాలోని 421 పంచాయతీ లు, ఆరు మునిసిపాలిటీలకు రూ.108.45కోట్లు మంజూరుచే స్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు సైతం జారీచేసింది.


పరిష్కరించాల్సిన సమస్యలివీ..

పెంకుటిళ్లను తొలగించి పక్కా భవనాలు, అంతర్గత మురుగు కాల్వలు, సీసీరోడ్లు నిర్మించాల్సి ఉంది. రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు అందించాలి. నిరుపేద రైతులకు బోరు బావులు, మోటార్లు రాయితీపై అందించాలి. గృహిణులు కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసుకునేందుకు వివిధ రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంది. గ్రామంలో కోతులు, అడవి పందుల రాకుండా చర్యలు తీసుకోవాలి. అర్హులైన వారందరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడంతోపాటు, భూ సమస్యలు పరిష్కరించాలి. గ్రామానికి అనుసంధానంగా వివిధ గ్రామాలకు లింక్‌రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు, పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌, వెటర్నరీ సబ్‌సెంటర్లు, నూతన భవనాలు నిర్మించాలి. మహిళా సంఘాలకు మినీ బ్యాంక్‌ కోసం భవనం, సహకార సంఘాలకు సొసైటీ భవనం, రైతులు పండించిన ధాన్యం నిల్వచేసేందుకు గోదాములు నిర్మించాల్సి ఉంది. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం, రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, మాంసం విక్రయాలకు షెడ్డు ఏర్పాటు చేయాలి. నూతన పంచాయతీ భవ నం, మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్రామంలో కల్యాణ మండపం, గ్రామదేవతల ఆలయాలు, పాఠశాలకు నూతన భవనాలు నిర్మించాల్సి ఉంది. వీటిని సీఎం పర్యటన  నేపథ్యంలో ప్రత్యేక నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది.


సీఎం పర్యటన తర్వాత

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వాసాలమర్రిలో జిల్లా యంత్రాంగం పలుమార్లు పర్యటించింది. గ్రామస్థులతో అధికారు లు సమావేశమై అభివృద్ధి నివేదికను రూపొందించారు. అంతేగాక పలు కమిటీలను ఏర్పాటుచేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ, వసతు ల కల్పన కమిటీ, వ్యవసాయ కమిటీ, మార్కెటింగ్‌ కమిటీ, వైద్య ఆరోగ్య కమిటీ, పారిశుధ్యం, నీటి సరఫరా కమిటీ, హరితహారం కమిటీలను ఏర్పాటుచేశారు. అనంతరం నిజామాబాద్‌జిల్లా అంకాపూర్‌ను గ్రామస్థులు, అధికారుల బృందం సందర్శించి అక్కడి అభివృద్ధిని అధ్యయనం చేసింది. గ్రామంలో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి, కుటుంబాల సంఖ్య, సభ్యులు, అక్షరాస్యులు, వృ త్తి, భూ విస్తీర్ణం, ఇతర వృత్తులవారు, ఆరోగ్యపరిస్థితులను సేకరించారు. ప్రత్యేకంగా హెల్త్‌ క్యాంపును ఏర్పాటుచేసి గ్రామస్థుల హెల్త్‌ప్రొఫైల్‌ను సిద్ధం చేశారు. 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశారు. రెండో డోస్‌ పంపిణీకి సన్నాహా లు చేస్తున్నారు. ప్రతీ మంగళవారం గ్రామంలో శ్రమదానం నిర్వహిస్తున్నారు. భూసర్వే నిర్వహించి సమస్యలు లేకుండా రెవె న్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాగుయోగ్య భూమి, పంటల వివరాలను సేకరించారు. ప్రభుత్వ భూమి, ఏ సర్వే నెంబర్లలో ఉందో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. రూ.2.16కోట్లతో సబ్‌స్టేషన్‌తో పాటు స్తంభాలు ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. రోడ్డు విస్తరణకు సర్వే నిర్వహిస్తున్నారు. నృసింహస్వామి గుట్ట వరకు రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ సర్వే నిర్వహించింది. గుడి వద్ద సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేస్తున్నారు.



ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ పమేలాసత్పథి

తుర్కపల్లి: సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యం లో వాసాలమర్రిలో ఏర్పాట్ల ను కలెక్టర్‌ పమేలాసత్పథి మంగళవారం పరిశీలించా రు. గ్రామంలో పారిశుధ్య పనులు, రైతు వేదిక భవనాన్ని పరిశీంచారు. కాగా, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబు, డాగ్‌స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించాయి. భద్రతా ఏర్పాట్లను భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు. సీఎం 11గంటలకు రానున్నట్టు తెలిసింది. 50మంది దళితులతో కలిసి దళితవాడలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని, సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు ఇంట్లో భోజనం చేస్తారని సమాచారం. అనంతరం రైతు వేదిక వద్ద గ్రామస్థులతో సమావేశం అవుతారని తెలిసింది.


వాసాలమర్రి ప్రొఫైల్‌

జనాభా : 2,373,

పురుషులు : 1,011

స్త్రీలు : 1,362

పిల్లలు(0-5) : 172

భూ విస్తీర్ణం : 1592హెక్టార్లు 

సాగు భూమి : 791హెక్టార్లు 

అటవీ ప్రాంతం : 455హెక్టార్లు 

ఇళ్లు : 156

ఆసరా లబ్ధిదారులు : 240

స్వయం సహాయక సంఘాలు : 42

అంగన్‌వాడీలు : 3

హైస్కూల్‌ : 1

ప్రాథమిక పాఠశాల : 1

నీటి వనరులు : 11చెరువులు

జీవాలు : 1340

Updated Date - 2021-08-04T05:44:33+05:30 IST