త్వరలోనే 3,456 వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీ
ABN , First Publish Date - 2020-09-17T07:45:35+05:30 IST
త్వరలోనే 3,456 వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. నియామకాలకు
శాసన మండలిలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): త్వరలోనే 3,456 వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. నియామకాలకు ప్రస్తుతం విధివిధానాలను రూపొందిస్తున్నామని అన్నారు. వార్డు స్థాయిలో పౌర సేవలన్నింటికీ వీరు బాధ్యులుగా ఉంటారని చెప్పారు. శాసన మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. కొత్త మునిసిపల్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు పంచాయతీ కార్యదర్శుల మాదరిగానే వార్డు ఆఫీసర్లకు మూడేళ్ల ప్రొబేషన్ పెడుతున్నామని, ఆ తర్వాత వారి సేవలను బట్టి క్రమబద్ధీకరిస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వార్డు కార్యాలయాలనూ ఏర్పాటు చేస్తున్నామని, మేయర్/చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు కార్యాలయంలో కూర్చుని కలిసి పనిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సరిగా బాధ్యతలు నిర్వహించకపోయినా, అవినీతికి పాల్పడినా సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. వార్డు ఆఫీసర్ల పనితీరును పర్యవేక్షించేందుకు అవసరమైతే టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.