రెమ్డెసివర్ ఇంజక్షన్ల బ్లాక్మార్కెట్
ABN , First Publish Date - 2021-05-15T09:55:14+05:30 IST
రెమ్డెసివర్ ఇంజక్షన్ల బ్లాక్మార్కెట్
ఇద్దరు నర్సులు.. ఒక ఎంఎన్వో సస్పెండ్
ఏలూరు క్రైం, మే 14: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో రెమ్డెసివర్ ఇంజక్షన్లను ఆస్పత్రి నుంచి తస్కరించిన ఇద్దరు నర్సులతో పాటు ఒక ఎంఎన్వోను విధుల నుంచి సస్పెండ్ చేశారు. స్టాఫ్ నర్స్ మన్నం లావణ్య, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ రాయల వెంకటలక్ష్మి, కాంట్రాక్ట్ ఎంఎన్వో బొమ్మకంటి రవి బ్రహ్మయ్య అలియాస్ ట్రామాకేర్ రవిలను సస్పెండ్ చేస్తూ జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్ ఏవీఆర్ మోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వారు ఇంజక్షన్లను అపహరించి బ్లాక్మార్కెట్లో అధిక ధరలకు విక్రయించే ముఠాకు అందజేశారు. ఈ ముఠాను ఏలూరు టూటౌన్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కాగా.. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కొవిడ్ విధులు నిర్వర్తిస్తోన్న ఇద్దరు ఎంఎన్వోలు రామకృష్ణ, లోకేశ్.. ఆక్సిజన్ బెడ్లు ఇప్పిస్తామని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి వారిని కూడా సస్పెండ్ చేశారు.