ఓఎల్‌ఎక్స్‌లో ‘రెమ్‌డెసివిర్‌’ విక్రయాలు

ABN , First Publish Date - 2021-04-17T07:22:59+05:30 IST

కరోనా చికిత్సకు వినియోగిస్తున్న యాంటీ వైరల్‌ ఔషధం ‘రెమ్‌డెసివిర్‌’ కొరతను కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు

ఓఎల్‌ఎక్స్‌లో ‘రెమ్‌డెసివిర్‌’ విక్రయాలు

ఒక ఇంజెక్షన్‌ ధర రూ.6 వేలు..  ఔషధ కొరతను సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

ఐదు రోజుల్లో రాష్ట్రాలకు 6.69 లక్షల ఇంజెక్షన్లు : కేంద్రం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16 : కరోనా చికిత్సకు వినియోగిస్తున్న యాంటీ వైరల్‌ ఔషధం ‘రెమ్‌డెసివిర్‌’ కొరతను కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ‘ఓఎల్‌ఎక్స్‌’ అనే క్లాసిఫైడ్స్‌ వెబ్‌సైట్‌ వేదికగా భారీ ధరలకు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల అమ్మకానికి తెరతీశారంటూ ఓ ఆంగ్ల టీవీచానల్‌ శుక్రవారం కథనాన్ని ప్రసారం చేసింది. గుజరాత్‌, మహారాష్ట్రకు చెందిన పలువురు ఓఎల్‌ఎక్స్‌ వినియోగదారులు వాటిని విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.5-6వేలకు అమ్ముతున్నారని పేర్కొంది. 100 ఇంజెక్షన్లను విక్రయిస్తానంటూ ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చిన గుజరాత్‌ వ్యక్తికి ఫోన్‌ చేయగా.. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.1680కు అమ్ముతానని బదులిచ్చాడని కథనంలో ప్రస్తావించింది. కాగా, రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి డి.వి.సదానందగౌడ వెల్లడించారు. గత ఐదురోజుల వ్యవధిలో రాష్ట్రాలకు 6.69 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను పంపినట్లు తెలిపారు. ప్రధాన ఫార్మా కంపెనీలు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ ధరను రూ.5400 నుంచి రూ.3,500కు తగ్గించడాన్ని ప్రధానమంత్రి మోదీ ఘనతగా ఆయన అభివర్ణించారు. 

Updated Date - 2021-04-17T07:22:59+05:30 IST