భారీగా మిగిలిపోయిన Engineering‌ Seats

ABN , First Publish Date - 2021-11-25T15:46:17+05:30 IST

రాష్ట్రంలో..

భారీగా మిగిలిపోయిన Engineering‌ Seats

మూడు విడతల్లో పూర్తయిన కౌన్సెలింగ్‌

ఖాళీగా 22,679 సీట్లు.. సీఎస్ఈ, ఐటీవైపే విద్యార్థుల మొగ్గు


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్లు భారీగా మిగిలిపోయాయి. మూడుసార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించినప్పటికీ సుమారు 22,679 సీట్లు ఇంకా భర్తీ కాలేదు. డిమాండ్‌ ఉన్న ఇంజనీరింగ్‌ బ్రాంచీలు మినహా, మిగతావాటిలో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో భారీ సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎంసెట్‌ తుది దశ కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం అభ్యర్థులకు ఇంజనీరింగ్‌ సీట్లను కేటాయించారు. తాజా కౌన్సెలింగ్‌తో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మూడు దశల్లో సీట్ల కేటాయింపు కసరత్తును పూర్తిచేశారు. మొత్తం 79,856 సీట్లు ఉండగా, ఇప్పటివరకు  57,177 సీట్లు... అంటే 71% మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా సుమారు  22,679 సీట్లు భర్తీ కాకుండా మిగిలి పోయాయి.


మొదటి విడత, తుది విడత, స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ల తర్వాత కూడా 29% సీట్లు మిగిలాయి. సీట్లు పొందిన విద్యార్థులంతా ఈ నెల 26లోగా ఫీజు చెల్లించి, కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని అధికారులు సూచించారు. రిపోర్ట్‌ చేయకపోతే కేటాయించిన సీట్లు రద్దవుతాయని తెలిపారు. కాగా, డిమాండ్‌ ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత కోర్సులవైపే విద్యార్థులు కౌన్సెలింగ్‌లో మొగ్గుచూపారు. సీఎస్ఈ, ఐటీ బ్రాంచీల్లో  కన్వీనర్‌ కోటాలో మొత్తం 44,114 సీట్లు ఉండగా 87% వరకు సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్‌, మెకానికల్‌ సంబంధిత కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు అంతగా ముందుకు రావడం లేదు. వీటికి సంబంధించి ఇంకా 65% సీట్లు ఖాళీగానే ఉన్నాయి.


నేడు స్పాట్‌ అడ్మిషన్లు: ఇంజనీరింగ్‌, బీ ఫార్మసీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేేసేందుకు నవంబర్‌ 25వ తేదీన స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. కాలేజీల యాజమాన్యాలే ఈ సీట్లను భర్తీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Updated Date - 2021-11-25T15:46:17+05:30 IST