Reliance Jio: తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న జియో
ABN , First Publish Date - 2022-07-20T02:21:58+05:30 IST
దేశంలోని అగ్రగామి టెలికం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio) తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది
న్యూఢిల్లీ: దేశంలోని అగ్రగామి టెలికం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio) తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది మే నెలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా 3.27 లక్షల మంది సబ్స్క్రైబర్లను చేర్చుకుంది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) తాజాగా విడుదల చేసిన సబ్స్క్రైబర్ డేటా ప్రకారం.. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా 3,27,020 మంది కొత్తగా జియో చందాదారులుగా మారారు. అదే సమయంలో భారతి ఎయిర్టెల్(Bharti Airtel)కు 71,312 మంది కొత్తగా వచ్చి చేరగా, వొడాఫోన్ ఐడియా( Vodafone Idea) 74,808 మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL)కు 78,423 మంది సబ్స్క్రైబర్లు గుడ్బై చెప్పేశారు.
ఇక, దేశవ్యాప్తంగా చూసుకుంటే మే నెలలో జియోకు 31.11 లక్షల మంది మొబైల్ సబ్స్క్రైబర్లు వచ్చి చేరారు. వీరితో కలుపుకుని జియో మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరుకుంది. అలాగే, అదే నెలలో భారతి ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 10.27 లక్షల మంది సబ్స్క్రైబర్లను చేర్చుకుంది. వీరితో కలుపుకుని ఆ సంస్థ మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్లు చందాదారులను భారీగా కోల్పోయాయి. వొడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్ల సంఖ్య 7.59 లక్షలు తగ్గి 25.84 కోట్లకు పడిపోగా, బీఎస్ఎన్ఎల్ ఖాతాదారుల సంఖ్య 53.62 లక్షలు తగ్గి 11.28 కోట్లకు పడిపోయింది.