టెట్లో 3.28 లక్షల మంది అర్హత.. నియామకాల్లో 20% వెయిటేజీ
ABN , First Publish Date - 2022-07-02T15:57:46+05:30 IST
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో 3.28 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2తో పోలిస్తే... పేపర్-1లో అర్హత శాతం గతంలో కంటే కొంత
పేపర్-1లో 32.68 శాతం.. పేపర్-2లో 49.64 శాతం అర్హులు
టెట్ ఫలితాల విడుదల.. ఉపాధ్యాయ నియామకాల్లో 20% వెయిటేజీ
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో 3.28 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2తో పోలిస్తే... పేపర్-1లో అర్హత శాతం గతంలో కంటే కొంత తగ్గింది. ఈ నెల 12వ తేదీన నిర్వహించిన టెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో, 1480 కేంద్రాల్లో టెట్ పరీక్షను ఆన్లైన్ పద్ధతిలో... తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠి, తమిళం, బెంగాళీ, గుజరాతీ భాషల్లో నిర్వహించారు. పేపర్-1లో 1,04,078 మంది, పేపర్-2లో 1,24,535 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో... జనరల్ క్యాటగిరీలో 90 మార్కులు సాధించిన వారిని అర్హులుగా ప్రకటించారు. అలాగే బీసీ క్యాటగిరీలో 75 మార్క్చుజీ; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాటగిరీల్లో 60 మార్కులు తెచ్చుకున్నవారిని అర్హులుగా పరిగణనలోకి తీసుకున్నారు. టెట్లో సాధించిన మార్కులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈసారి బీఎడ్ చేసిన అభ్యర్థులను కూడా పేపర్-1 రాయడానికి అనుమతించారు. దీంతో గతంలో కంటే ఎక్కువమంది ఈ పేపర్ రాశారు. అయితే ఇలాంటి అభ్యర్థులు పేపర్-1 కంటే పేపర్-2పై ఎక్కువ దృష్టిపెట్టారు. దాంతో పేపర్-1లో అర్హత శాతం తగ్గింది. కాగా, పేపర్-2లో సోషల్ స్టడీస్ సబ్జెక్టుతో పోలిస్తే... మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో అర్హుల శాతం ఎక్కువగా నమోదైంది. సోషల్ స్టడీస్లో 40.41 శాతం మంది అర్హత సాధించగా... మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో 57.67 శాతం మంది అర్హత సాధించారు. టెట్ ఫలితాలను https://tstet.cgg.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చు.