నేడే శశికళ విడుదల!

ABN , First Publish Date - 2021-01-27T06:55:45+05:30 IST

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బుధవారం జైలు నుంచి విడుదల కానున్నారు. అ

నేడే శశికళ విడుదల!

అక్రమాస్తుల కేసులో పూర్తయిన జైలుశిక్ష

కొవిడ్‌ నుంచి కోలుకుంటున్నారన్న వైద్యులు


బెంగళూరు, జనవరి 26: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బుధవారం జైలు నుంచి విడుదల కానున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైలు అధికారుల సమాచారం మేరకు జైలు శిక్ష పూర్తయింది. అయితే, కరోనా బారిన పడిన శశికళ ప్రస్తుతం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున, ఆమె విడుదలకు సంబంధించిన ఫార్మాలిటీలన్నీ ఆస్పత్రి వద్దే పూర్తి చేయనున్నట్టు జైలు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఆమె కరోనా నుంచి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే, ఆస్పత్రి నుంచి ఆమెను ఎప్పుడు ఇంటికి పంపిస్తారో ఇంకా స్పష్టత లేదు. వైద్యులను సంప్రదించిన తర్వాత ఆమె ఎప్పుడు ఇంటికి వస్తారో వెల్లడిస్తామని ఆమె మేనల్లుడు, అమ్మ మక్కల్‌ మున్నేత్ర కజగం పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ చెప్పారు. కాగా, కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం పది రోజులు ఆస్పత్రిలో ఉండాలని విక్టోరియా ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. కాగా, శశికళ బంధువు ఇళవరసి ఫిబ్రవరి మొదటి వారంలో జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె కూడా కరోనా బారిన పడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2021-01-27T06:55:45+05:30 IST