విడుదల ఎప్పటికో..

ABN , First Publish Date - 2020-05-21T09:31:40+05:30 IST

కరోనా నిర్ధారణ కోసం క్వారంటైన్‌కు తరలించారు అధికారులు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన

విడుదల ఎప్పటికో..

ఆంధ్రజ్యోతి, విజయవాడ : కరోనా నిర్ధారణ కోసం క్వారంటైన్‌కు తరలించారు అధికారులు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను స్టేషన్‌ క్వారంటైన్‌కు పంపారు పోలీసులు. మొదట్లో బెదిరింపులతో సరిపెట్టిన పోలీసులు తర్వాత కఠినంగా వ్యవహరించారు. కొన్నిరోజులపాటు వాహనాలపై జరిమానాలు విధించారు. అయినా వాహనదారుల్లో మార్పు కనిపించలేదు. లాక్‌డౌన్‌ సడలింపులు లేని సమయాల్లో రోడ్ల మీదకు వచ్చిన వాహనాలను సీజ్‌ చేశారు. ఒకే వాహనంపై ఇద్దరు వెళ్తున్న వాహనాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ఇలా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో బైక్‌లు, కారులు, ఆటోలు, వెరసి మొత్తం సుమారు 8వేల వాహనాలను సీజ్‌ చేశారు. వాటిలో కొన్ని వాహనాలను పోలీస్‌స్టేషన్ల వద్ద ఉంచగా, మరికొన్నింటిని ఏఆర్‌ గ్రౌండ్స్‌, స్వరాజ్యమైదాన్‌, ఈద్గా మైదాన్‌లో భద్రపరిచారు.


ఈ వాహనాల్లో కొన్నింటిని ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌చేస్తే, మరికొన్నింటిని లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు సీజ్‌ చేశారు. ఇలా సీజ్‌ చేసిన వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇందులో ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలను మాత్రం జరిమానా విధించి వదిలిపెట్టాలని నిర్ణయించారు. ఇక లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలు ఇప్పట్లో ఇళ్లకు చేరే సూచనలు కనిపించడం లేదు. 8వేల వాహనాల్లో సగం వాహనాలు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుల ఖాతాలో ఉన్నాయి. వాటిలో 1,000 లేక 1,500 వాహనాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.


వాటిపై చార్జిషీటు దాఖలు చేస్తారు. అంటే మొత్తం మీద కేసుల విచారణ పూర్తయ్యే వరకు వాహనాలు పోలీసుల ఆధీనంలోనే ఉంటాయి. అప్పటి వరకు విడుదలకు మోక్షం ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలు పాడైపోతాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమూర్తి ఇచ్చే ఆదేశాలను బట్టి నిర్ణయం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2020-05-21T09:31:40+05:30 IST